నెల రోజుల్లో నివేదిక; తర్వాత చర్యలు
న్యూఢిల్లీ: ఫేమ్–2 స్కీము నిబంధనల ఉల్లంఘనలో అధికారులపరంగా తప్పిదాలు జరిగాయన్న ఆరోపణలపైనా కేంద్రం దృష్టి పెట్టింది. వాటితో పాటు వేలిడేషన్, టెస్టింగ్ ఏజెన్సీలైన ఆటోమోటివ్ రీసెర్చ్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (ఏఆర్ఏఐ), ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ ఆటోమోటివ్ టెక్నాలజీ (ఐసీఏటీ) అధికారుల పాత్రపైనా కేంద్ర భారీ పరిశ్రమల శాఖ విచారణ ప్రారంభించింది. దీనికి సంబంధించి నెల రోజుల వ్యవధిలో నివేదిక రావచ్చని శాఖ కార్యదర్శి కమ్రాన్ రిజ్వి తెలిపారు.
ఆ తర్వాత ఉల్లంఘనలకు బాధ్యులైన వారితో పాటు సిస్టమ్స్ను కూడా సరిదిద్దే చర్యలు ఉంటాయని పేర్కొన్నారు. స్థానికంగా తయారీని, విద్యుత్ వాహనాల వినియోగాన్ని ప్రోత్సహించేందుకు.. ఎలక్ట్రిక్ వాహనాల తయారీ సంస్థలకు సబ్సిడీలు ఇచ్చేలా కేంద్రం రూ. 10,000 కోట్లతో ఫేమ్–2 స్కీమును ప్రవేశపెట్టింది. అయితే, నిబంధనలకు విరుద్ధంగా పలు కంపెనీలు పెద్ద స్థాయిలో దిగుమతి చేసుకుంటున్నాయని, ఏడు సంస్థలు నిబంధనలకు విరుద్ధంగా ప్రోత్సాహకాలు పొందాయని ఆరోపణలొచ్చాయి.