పల్లెల్లో సాఫ్ట్‌వేర్‌ కొలువులు.. 3.30 లక్షల ప్యాకేజీ

25 Nov, 2022 15:29 IST|Sakshi

స్మార్ట్‌ డీవీ ఐటీ కంపెనీలో 4,500 మందికి ఉద్యోగాలు

గంగాధరనెల్లూరు: పల్లెల్లోని విద్యావంతులకు సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగాలు కల్పించడమే స్మార్ట్‌ డీవీ లక్ష్యమని.. తమ కంపెనీలో 4,500 మందికి ఉద్యోగావకాశాలు కల్పిస్తామని కంపెనీ మేనేజింగ్‌ డైరెక్టర్‌ దీపక్‌కుమార్‌ తాళ్ల తెలిపారు. 

చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు మండలంలోని అగరమంగళంలో ఆయనతో పాటు ఏపీఎస్‌ ఆర్టీసీ వైస్‌ చైర్మన్‌ విజయానందరెడ్డి, ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు మీడియాతో మాట్లాడారు. ఎస్‌ఆర్‌ పురం మండలం కొట్టార్లపల్లి వద్ద స్మార్ట్‌ డీవీ కంపెనీ ఏర్పాటుకు సీఎం వైఎస్‌ జగన్‌ చేతుల మీదుగా ఎంవోయూ జరిగిందని, నిర్మాణ పనులు వేగంగా సాగుతున్నాయని తెలిపారు. 

దీనిలో పనిచేసేందుకు ఆసక్తి గల అభ్యర్థులకు డిసెంబర్‌ 23న పరీక్షలు నిర్వహిస్తామని, తొలి విడతగా 600 మందిని తీసుకుంటామన్నారు. డిప్లొమా, బీటెక్‌ పూర్తి చేసిన వారితో పాటు ప్రస్తుతం చదువుతున్న వారూ అర్హులని తెలిపారు. ఎంపికైన ఫస్టియర్‌ డిప్లొమో, బీకాం, డిగ్రీ చేసిన వారికి రూ.2.70 లక్షలు, బీటెక్‌ చేసిన వారికి రూ.3.30 లక్షల ప్యాకేజీ ఉంటుందన్నారు. (క్లిక్ చేయండి: రాయలసీమకు కొత్తగా 9 జాతీయ రహదారులు)

మరిన్ని వార్తలు