ఫైన్ మాత్రమే కాదు.. కొత్త కారు కూడా! కస్టమర్ దెబ్బకు ఖంగుతిన్న డీలర్‌

19 Oct, 2023 12:59 IST|Sakshi

కార్లను కొనుగోలు చేసినప్పుడు డీలర్‌షిప్‌ వర్గాలు కొన్ని సందర్భాల్లో మోసం చేసే అవకాశం ఉంటుంది. ఇలాంటి మోసాలకు బలైన బాధితులు కన్స్యూమర్ కోర్టు ద్వారా పరిష్కారం లేదా నష్టపరిహారం పొందుతారు. ఇటీవల కర్ణాటకలో ఇలాంటి సంఘటన వెలుగులోకి వచ్చింది.

కర్ణాటకకు చెందిన వ్యక్తి 2019 జూన్ 11న 'అద్వాతి మోటార్స్ ప్రైవేట్ లిమిటెడ్' నుంచి 'హ్యుందాయ్ శాంట్రో ఎమ్‌టి స్పోర్ట్జ్' (Hyundai Santro M.T Sportz) కారును రూ. 6,25,663కు కొనుగోలు చేశాడు. ఆ తరువాత ఇందులో లోపాలు ఉన్నట్లు, రెండు సర్వీసింగ్ సెషన్‌లకు లోనయ్యిందని డీలర్‌షిప్‌కు విన్నవించాడు.

కస్టమర్ అభ్యర్థన మేరకు డీలర్‌షిప్ రెండు సార్లు సర్వీస్ చేసింది. సర్వీస్ చేసిన తరువాత 2020 అక్టోబర్ 17న బాణావర నుంచి అరసికెరెకు ప్రయాణిస్తుండగా కారులో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో ప్రయాణికులు బయటపడ్డారు, అదృష్టవశాత్తు ఎవరికీ పెద్ద గాయాలు కాలేదు.

సంఘటన జరిగిన వెంటనే వినియోగదారుడు షోరూమ్‌కు తెలియజేశాడు, డీలర్‌షిప్ యాజమాన్యం స్పందిస్తూ.. కారును రీప్లేస్ చేస్తామని హామీ ఇచ్చారు. కానీ ఎన్ని రోజులు ఎదురు చూసినా కస్టమర్‌కు కారుని అందించలేదు. దీంతో విసిగిపోయిన కస్టమర్‌ బాణవర పోలీస్ స్టేషన్‌లో ఎఫ్‌ఐఆర్ దాఖలు చేశాడు. 

కారు తయారీలో లోపాలు ఉన్నట్లు, అదే కారులో మంటలు రావడానికి కారణమని డిస్ట్రిక్ట్ కన్స్యూమర్ డిస్ప్యూట్ రిడ్రెసల్ క‌మిష‌న్‌కు తెలియజేశాడు. కాలిపోయిన కారుకు బదులుగా ఇంకో కారు ఇస్తామన్న షోరూమ్ వాగ్దానాలను వెల్లడించాడు. ఈ సంఘటన మానసిక ఒత్తిడికి దారితీసినట్లు, ఎక్కువ ఆర్థిక నష్టాన్ని కలిగించినట్లు ప్రస్తావించాడు.

ఇదీ చదవండి: గంటకు 23 మంది.. ఏడాదికి వేలల్లో.. ఆందోళనలో టెకీలు!

విచారణ తర్వాత డిస్ట్రిక్ట్ కమిషన్.. తయారీ లోపం వల్ల అగ్ని ప్రమాదం జరిగినట్లు నిర్థారించి, దీనికి షోరూమ్ బాధ్యత వహించి కొత్త హ్యుందాయ్ శాంత్రోను అందించాలని, కస్టమర్‌కు 1.4 లక్షల పరిహారం ఇవ్వాలని కంపెనీని ఆదేశించింది.

మరిన్ని వార్తలు