CPI inflation: మూడు నెలల కనిష్ఠానికి చేరనున్న సీపీఐ ద్రవ్యోల్బణం!

10 Oct, 2023 12:34 IST|Sakshi

5.4 శాతానికి తగ్గుతుందని నిపుణుల అంచనా

భారత గణాంకాల మంత్రిత్వ శాఖ సెప్టెంబర్‌కు సంబంధించిన వినియోగదారుల ధరల సూచీ డేటాను, ఆగస్టులోని పారిశ్రామిక ఉత్పత్తి  డేటాను అక్టోబరు 12న విడుదల చేయనుంది. అందుకు నిపుణులు కారణాలను విశ్లేసిస్తున్నారు. దానికి సంబంధించిన వివరాలు తెలుసుకుందాం.

భారతదేశ రిటైల్ ద్రవ్యోల్బణం సెప్టెంబర్‌లో మూడు నెలల కనిష్ఠానికి పడిపోయే అవకాశం ఉన్నట్లు నిపుణులు చెబుతున్నారు. వినియోగదారుల ధరల సూచీ(సీపీఐ) ద్రవ్యోల్బణం ఆగస్టులో 6.83 శాతంగా ఉంది. కానీ సెప్టెంబరు నెలకు అది 5.4 శాతానికి తగ్గుతుందని అంచనా. పారిశ్రామికోత్పత్తి సూచీ జులైలో 5.7తో పోలిస్తే ఆగస్టులో 9.1కు పెరిగినట్లు తెలుస్తుంది. అయితే ఇది గడిచిన 14 నెలల్లో అత్యధికం. 

సెప్టెంబర్‌లో టమాటా ధరలు సాధారణ స్థితికి రావడంతో నెలవారీగా ఖర్చుల శాతం తగ్గినట్లు నిపుణులు చెబుతున్నారు. దాంతో పాటు ఇండియన్‌ మార్కెట్‌లు జీవితకాలపు గరిష్ఠాల్లో ట్రేడయ్యాయి. అయితే అదే సమయంలో ఆగస్టుతో పోలిస్తే సెప్టెంబర్‌లో ఉల్లి ధరలు 12 శాతం పెరిగాయి. తృణధాన్యాలు, పప్పుల ధరలు పెరిగాయి. సెప్టెంబరులో అంతర్జాతీయ చమురు ధరలు దాదాపు 8.8శాతం పెరిగినప్పటికీ చమురు మార్కెటింగ్ కంపెనీలు మాత్రం ధరలపై ఎలాంటి ప్రభావం చూపకపోవడం కొంత ఊరట కలిగించినట్లు కొన్ని వర్గాలు తెలిపాయి. అన్ని కారణాల వల్ల ద్రవ్యోల్బణం దాదాపు ఒకటిన్నర శాతం తగ్గుతుందని విశ్లేషకులు చెబుతున్నారు.
 

మరిన్ని వార్తలు