అన్ని బ్యాంకులు, పోస్టాఫీసుల్లో ఎన్‌పీఎస్‌

29 Sep, 2023 05:23 IST|Sakshi

అందుబాటులోకి తెచ్చేందుకు కృషి

పీఎఫ్‌ఆర్‌డీఏ చైర్మన్‌ దీపక్‌ మహంతి

న్యూఢిల్లీ: జాతీయ పింఛను వ్యవస్థ (ఎన్‌పీఎస్‌)ను అన్ని బ్యాంక్‌ శాఖలు, తపాలా కార్యాలయాల్లో (పోస్టాఫీసులు) అందుబాటులోకి తీసుకొచ్చేందుకు కృషి చేస్తున్నట్టు పింఛను నిధి నియంత్రణ, అభివృద్ధి మండలి (పీఎఫ్‌ఆర్‌డీఏ) చైర్మన్‌ దీపక్‌ మహంతి తెలిపారు. ప్రజలకు సులభంగా ఎన్‌పీఎస్‌ను అందుబాటులో ఉంచేందుకు, ఈ పథకాన్ని మరింత మందికి చేరువ చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్టు చెప్పారు.

‘‘ఎన్‌పీఎస్‌ పథకం పంపిణీ కోసం ప్రాంతీయ గ్రామీణ బ్యాంక్‌లు, బ్యాంకింగ్‌ కరస్పాండెంట్లతో పీఎఫ్‌ఆర్‌డీఏ జట్టు కడుతోంది. దీంతో పల్లెలు, చిన్న పట్టణాల్లోని ప్రజలు సైతం ఈ పథకం ప్రయోజనాలను సులభంగా పొందడానికి వీలుంటుంది’’అని పీఎఫ్‌ఆర్‌డీఏ చైర్మన్‌ తెలిపారు. ప్రైవేటు రంగం నుంచి కార్పొరేట్, వ్యక్తిగత స్థాయిలో 13 లక్షల మందిని ఎన్‌పీఎస్‌ చందాదారులుగా చేర్చుకునే లక్ష్యంతో ఉన్నట్టు మహంతి చెప్పారు. గత ఆర్థిక సంవత్సరంలో 10 లక్షల మందిని చేర్చుకున్నట్టు పేర్కొన్నారు.

అధికారిక గణాంకాల ప్రకారం 2023 సెపె్టంబర్‌ 16 నాటికి ఎన్‌పీఎస్‌ చందారులు 1.36 కోట్లుగా ఉన్నారు. అటల్‌ పెన్షన్‌ యోజన కింద చందాదారులు 5 కోట్లుగా ఉన్నారు. ఎన్‌పీఎస్‌ కింద స్థిర పింఛను ఎందుకు నిర్ణయించలేదన్న ప్రశ్నకు మహంతి బదులిచ్చారు. ‘‘దీర్ఘకాలానికి పింఛను నిర్ణయించడం సాధ్యపడదు. కొన్ని అభివృద్ధి చెందిన దేశాల్లోనూ, జీడీపీతో సమానంగా లేదంటే అంతకుమించి పింఛను నిధి ఉన్నా కానీ, ఈ విషయంలో సమస్య నెలకొంది’’అని వివరించారు.

అయితే, ఎన్‌పీఎస్‌ నుంచి రాబడులు మెరుగ్గా ఉంటాయని చెబుతూ.. దీర్ఘకాలంలో మంచి నిధిని ఆశించొచ్చన్నారు. ఎన్‌పీఎస్‌ విక్రయంపై వచ్చే కమీషన్‌ చాలా తక్కువని, అందుకే ఏజెంట్లు దీని పట్ల ఆసక్తి చూపించడం లేదన్నారు. కానీ, ఎన్‌పీఎస్‌ను తక్కువ వ్యయంతో కూడిన ఉత్పత్తిగానే కొనసాగించాలని అనుకుంటున్నట్టు చెప్పారు. ఎన్‌పీఎస్, అటల్‌ పెన్షన్‌ యోజన పథకం నిర్వహణ ఆస్తులు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం చివరికి రూ.12 లక్షల కోట్లకు చేరుకుంటాయన్నారు.

మరిన్ని వార్తలు