పసిడి పోరుకు సాకేత్‌–రామ్‌ జోడీ

29 Sep, 2023 05:17 IST|Sakshi

ఆసియా క్రీడల టెన్నిస్‌ ఈవెంట్‌లో భారత్‌కు రెండు పతకాలు ఖాయమయ్యాయి. పురుషుల డబుల్స్‌ విభాగంలో సాకేత్‌ మైనేని–రామ్‌కుమార్‌ రామనాథన్‌ జోడీ ఫైనల్‌కు దూసుకెళ్లి స్వర్ణ పతకానికి విజయం దూరంలో నిలిచింది. సెమీఫైనల్లో సాకేత్‌–రామ్‌కుమార్‌ ద్వయం 6–1, 6–7 (6/8), 10–0తో ‘సూపర్‌ టైబ్రేక్‌’లో సెంగ్‌చన్‌ హాంగ్‌–సూన్‌వూ క్వాన్‌ (దక్షిణ కొరియా)పై గెలిచింది.

ఆంధ్రప్రదేశ్‌కు చెందిన సాకేత్‌ 2014 ఇంచియోన్‌ ఆసియా క్రీడల్లో పురుషుల డబుల్స్‌లో సనమ్‌ సింగ్‌తో కలిసి రజత పతకం, మిక్స్‌డ్‌ డబుల్స్‌లో సానియా మీర్జాతో కలిసి స్వర్ణ పతకం సాధించాడు. నేడు ఉదయం గం. 7:30 నుంచి జరిగే ఫైనల్లో జేసన్‌  జంగ్‌–యు సియో సు (చైనీస్‌ తైపీ) జంటతో సాకేత్‌–రామ్‌ జోడీ తలపడుతుంది. మరోవైపు మిక్స్‌డ్‌ డబుల్స్‌లో రోహన్‌ బోపన్న–రుతుజా భోస్లే (భారత్‌) ద్వయం సెమీఫైనల్‌ చేరి కనీసం కాంస్య పతకం ఖాయం చేసుకుంది. క్వార్టర్‌ ఫైనల్లో బోపన్న–రుతుజా 7–5, 6–3తో జిబెక్‌ కులామ్‌బయేవా–గ్రిగోరి లొమాకిన్‌ (కజకిస్తాన్‌)లపై గెలిచారు. నేడు జరిగ సెమీఫైనల్లో యు సియో సు–చాన్‌ హావో చింగ్‌ (చైనీస్‌ తైపీ)లతో బోపన్న–రుతుజా తలపడతారు.

మరిన్ని వార్తలు