ఈక్విటీ ఫండ్స్‌లో పెట్టుబడులు.. నవంబర్‌లో రూ.11,615 కోట్లు

10 Dec, 2021 14:53 IST|Sakshi

న్యూఢిల్లీ: ఈక్విటీ మ్యూచువల్‌ ఫండ్స్‌లో నెలవారీ పెట్టుబడులు నవంబర్‌లో రూ.11,615 కోట్లకు పెరిగాయి. ఇది నాలుగు నెలల గరిష్ట స్థాయి. మార్కెట్లు అస్థిరతల్లో ఉన్నప్పటికీ సిస్టమ్యాటిక్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ప్లాన్‌ (సిప్‌) రూపంలో పెట్టుబడులకు ఇన్వెస్టర్ల నుంచి ఆసక్తి కొనసాగడం పెట్టుబడులు బలంగా ఉండేందుకు దోహదం చేస్తోంది. ఈ ఏడాది అక్టోబర్‌లో ఈక్విటీ మ్యూచువల్‌ ఫండ్స్‌ రూ.5,215 కోట్లు, సెప్టెంబర్‌లో రూ.8,677 కోట్లు, ఆగస్ట్‌లో రూ.8,666 కోట్ల చొప్పున నికర పెట్టుబడులను ఆకర్షించాయి. ఈ ఏడాది జూలై తర్వాత అత్యధిక స్థాయిలో పెట్టుబడులు వచ్చింది నవంబర్‌లోనే కావడం గమనార్హం. ఈ ఏడాది జూలైలో ఈక్విటీ పథకాల్లోకి వచ్చిన పెట్టుబడులు రూ.25,002 కోట్లుగా ఉన్నాయి. మొత్తం మీద అన్ని రకాల పథకాల్లోకి కలిపి నవంబర్‌లో రూ.46,165 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. అక్టోబర్‌లో ఈ మొత్తం రూ.38,275 కోట్లుగా ఉంది. నవంబర్‌ చివరికి ఫండ్స్‌ పరిశ్రమ నిర్వహణలోని ఆస్తుల విలువ రూ.38.45 లక్షల కోట్లకు చేరుకుంది. 

హైబ్రిడ్‌ పథకాలు ఆదరణ  
-  ఫ్లెక్సీక్యాప్‌ ఫండ్స్‌లోకి రూ.2,660 కోట్ల పెట్టుబడులు వచ్చాయి.  
-  ఈక్విటీ హబ్రిడ్‌ పథకాల్లోకి వచ్చిన పెట్టుబడులు రూ.9,422 కోట్లుగా ఉన్నాయి.  
- సిప్‌ ఖాతాలు 4.78 కోట్లకు పెరిగాయి. నెలవారీగా సిప్‌ రూపంలో వచ్చే పెట్టుబడులు 11,005 కోట్లుకు చేరాయి.  
-  డెట్‌ పథకాల్లోకి నికరంగా రూ.14,893 కోట్ల పెట్టుబడులు వచ్చాయి.  
-  గోల్డ్‌ ఈటీఎఫ్‌ పథకాలు రూ.682 కోట్ల పెట్టుబడులను ఆకర్షించాయి.
 

మరిన్ని వార్తలు