రూ.346.6 కోట్ల నష్టం.. జొమాటో సంచలన నిర్ణయం!

12 Feb, 2023 20:33 IST|Sakshi

 ప్రముఖ ఫుడ్‌ డెలివరీ సంస్థ జొమాటో కీలక నిర్ణయం తీసుకుంది. దేశవ్యాప్తంగా 225 చిన్న నగరాల్లో తమ సంస్థ సేవలు నిలిపివేసినట్లు ప్రకటించింది. 

జొమాటో త్రైమాసిక ఫలితాల్ని విడుదల చేసింది. ఆ ఫలితాల్లో ఫుడ్ డెలివరీ రంగంలో ఎదుర్కొంటున్న ఒడిదుడుకుల కారణంగా డిసెంబర్‌తో ముగిసిన త్రైమాసికంలో కంపెనీ రూ.346.6 కోట్లు నష్టపోయినట్లు వెల్లడించింది. కాబట్టే పనితీరు ప్రోత్సాహకరంగా లేని చిన్న నగరాల్లో కార్యకలాపాలు నిలిపివేసినట్లు తెలిపింది.  

ప్రస్తుతం డిమాండ్‌లో మందగమనం ఊహించని విధంగా ఉంది. ఇది ఫుడ్ డెలివరీ లాభాల పెరుగుదలపై ప్రభావం చూపుతోంది. అయినప్పటికీ లాభదాయకత లక్ష్యాన్ని చేరుకునే స్థితులో ఉన్నామని భావిస్తున్నట్లు కంపెనీ తన క్యూ3 నివేదికలో పేర్కొంది.

అందుబాటులో గోల్డ్‌సబ్‌స్క్రిప్షన్‌ 
జొమాటో దేశంలో అత్యధికంగా ఉపయోగించే ఫుడ్ డెలివరీ యాప్‌లలో ఒకటి నిలిచింది.మార్కెట్‌ డిమాండ్‌ను క్యాష్‌ చేసుకునేందుకు గోల్డ్ సబ్‌స్క్రిప్షన్‌ను తిరిగి ప్రారంభించింది. మరోవైపు 225 చిన్న నగరాల నుండి వైదొలగాలని కంపెనీ నిర్ణయం తీసుకున్న తరుణంలో దాదాపు 800 మంది నియమించుకోవాలని యోచిస్తోంది.

మరిన్ని వార్తలు