అక్కడ క్రికెట్‌ వరల్డ్‌కప్‌ రోజున ఉచిత వసతి!

18 Nov, 2023 18:41 IST|Sakshi

ప్రపంచకప్‌ నేపథ్యంలో ఫైనల్‌ మ్యాచ్‌ జరిగబోయే అహ్మదాబాద్‌లో రద్దీ నెలకొంది. ప్రధానంగా మ్యాచ్‌ జరిగే నరేంద్రమోదీ స్టేడియం పరిసరాల్లోని హోటళ్లు మ్యాచ్‌ వీక్షకులతో కిక్కిరిసిపోయాయి. ఇప్పటికే టికెట్లు బుక్‌ చేసుకున్నవారికి వసతి కష్టంగా మారింది. ఈ తరుణంలో తాజాగా అహ్మదాబాద్‌లోని వేక్‌ఫిట్‌ మ్యాట్రెస్ సొల్యూషన్స్ కంపెనీ తమ స్టోర్‌లో ఉచిత బసను పొందేందుకు క్రికెట్ అభిమానులకు అవకాశం కల్పిస్తోంది.

క్రికెట్ అభిమానుల కోసం అహ్మదాబాద్‌లోని సర్ఖేజ్-గాంధీనగర్‌లో ఉన్న బోడక్‌దేవ్ అవుట్‌లెట్‌లో ప్రపంచ కప్ ‍మ్యాచ్‌ ముగిసిన తర్వాత ఉచిత బస ఏర్పాటు చేసినట్లు వేక్‌ఫీట్‌ ప్రకటించింది. అయితే ఇందుకోసం అభిమానులు ముందుగా తమ వెబ్‌సైట్‌లో మ్యాచ్‌ టికెట్‌ను సమర్పించాల్సి ఉంటుంది. పేరు, చిరునామా వంటి ప్రాథమిక వివరాలను కంపెనీకి ఈమెయిల్ చేయాలి. నవంబర్ 19, ఉదయం 11లోపు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని సంస్థ తెలిపింది. క్రికెట్‌ అభిమానులు ఎలాంటి ఇబ్బందులు పడకుండా ఈ నిర్ణయం తీసుకున్నట్లు కంపెనీ వర్గాలు తెలిపాయి. 

బెంగళూరుకు చెందిన స్టార్టప్ కంపెనీ అయిన వేక్‌ఫిట్ మ్యాట్రెస్‌ను తయారుచేస్తోంది. 2016లో స్థాపించిన ఈ కంపెనీ ఈ రంగంలో 30-40 శాతం మార్కెట్‌ను సొంతం చేసుకుందని సమాచారం.

మరిన్ని వార్తలు