అధిక మైలేజీ ఇవ్వకుంటే వాహనాల్ని వెనక్కి ఇచ్చేయొచ్చు.. వాహనదారులకు మహీంద్రా కంపెనీ బంపరాఫర్‌

17 Jan, 2022 21:10 IST|Sakshi

ఏ కంపెనీ అయినా ఇలాంటి ప్రకటన ఇస్తుందా? అనే అనుమానం రావొచ్చు. కానీ, మహీంద్రా గ్రూపు ఈ ఆసక్తికర స్కీంతో వాహనదారుల్ని ఆకట్టుకుంటోంది. అధిక మైలేజీ ఇవ్వని వాహనాలను వెనక్కి ఇచ్చేయొచ్చంటూ వాహనదారులకు ఆఫర్‌ ఇచ్చింది. ఈ మేరకు  మహీంద్రా ట్రక్ అండ్ బస్ (ఎంటీబీ) చేసిన ప్రకటన ఆటోమొబైల్‌ రంగంలో  చర్చనీయాంశంగా మారింది. 


ఎంటీబీ రూపొందించే బీఎస్6 ట్రక్కుల శ్రేణిలో ఏ ఒక్క మోడల్ అయినా అత్యధిక మైలేజీ ఇవ్వకపోతే దాన్ని వాపసు తీసుకుంటామని పేర్కొంది మహీంద్రా కంపెనీ. బీఎస్6 శ్రేణిలో భారీ, మధ్యస్థ, తేలికపాటి వాహనాలు ఉపయోగించేవాళ్లకు ఈ స్కీం వర్తిస్తుందని ప్రకటించుకుంది. ‘పోటీ కంపెనీ వాహనాల కంటే మా వాహనాలు మైలేజీ తక్కువ గనుక ఇస్తే.. వాహనదారులు నిరభ్యరంతంగా మా వాహనాల్ని వెనక్కి ఇచ్చేయొచ్చ’ని స్కీం గురించి వివరించింది కంపెనీ. ఈ మేరకు ‘బ్లేజో ఎక్స్ హెచ్ సీవీ, ఫ్యూరియో ఐసీవీ, ఫ్యూరియో 7, జేయో’ మోడల్ వాహనాలకు ఈ ఆఫర్ వర్తిస్తుందని ఎంటీబీ ఒక ప్రకటనలో తెలిపింది. ఇదిలా ఉంటే.. ఎండీఐ టెక్ ఇంజిన్లు, ఫ్యూయల్ స్మార్ట్ సాంకేతిక పరిజ్ఞానంతో ఎంటీబీ ఈ రవాణా వాహనాల్ని తయారు చేస్తోంది.

ఇంధన ధరలు పెరిగిపోతున్న ప్రస్తుత తరుణంలో వినియోగదారుల పరంగా చూస్తే ఇది సరైన పథకం అని మహీంద్రా అండ్ మహీంద్రా ఆటోమోటివ్ సెక్టార్ సీఈవో వీజయ్ నక్రా చెబుతున్నారు. ‘మహీంద్రా సంస్థ సాంకేతిక సామర్థ్యంపై వినియోగదారుల్లో నమ్మకాన్ని పెంచాలనుకుంటున్నాం. తద్వారా రవాణా వాహన శ్రేణిలో అత్యుత్తమ ప్రమాణాలు నెలకొల్పడంలో నిబద్ధత కనబరుస్తున్నాం’ అని నక్రా ప్రకటించుకున్నారు. అయితే సరుకు రవాణా వాహన విభాగంలో  పట్టు సాధించేందుకు మహీంద్రా అండ్ మహీంద్రా సంస్థ ఇలా సరికొత్త ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది.  

కొత్తేం కాదు.. 
‘‘మైలేజీ రాకపోతే వాహనాల్ని వెనక్కి ఇవ్వండి’’ అనే ప్రకటన మహీంద్రాకు కొత్తేం కాదు. 2016లో బ్లేజో ఎక్స్ హెచ్ సీవీ ట్రక్కుల విషయంలో ఇలాంటి స్కీమ్‌ అమలు చేసింది. అయితే ఆ టైంలో 33 వేల బ్లేజో ట్రక్కులు అమ్ముడుపోగా.. ఒక్క వాహనం కూడా వెనక్కి రాలేని ఎంటీబీ ప్రకటించుకుంది.

చదవండి: ఐఫోన్‌ అమ్మకాలతో యాపిల్‌ ఉక్కిరిబిక్కిరి,భారత్‌లో దూసుకెళ్తున్న సేల్స్‌!!

మరిన్ని వార్తలు