కొనడం కష్టమేనా : రాకెట్ వేగంతో దూసుకుపోతున్న బంగారం ధరలు!

20 Mar, 2023 19:42 IST|Sakshi

బంగారం ధరలు చుక్కలు తాకుతున్నాయి. ఓ వైపు ఆర్ధిక మాద్యం..మరోవైపు బ్యాంకుల దివాళా వెరసీ అంతర్జాతీయ మార్కెట్‌లో పసిడి ధర సోమవారం రోజు 1శాతం పెరిగింది. గత ఏడాది మార్చి తర్వాత ఈ స్థాయిలో పెరగడం గమనార్హం.

ప్రపంచ ప్రఖ్యాతి చెందిన బ్యాంకుల్లో ఆర్ధిక అవకతవకలు జరిగి మూతపడుతున్నాయి. ఇప్పటికే సిలికాన్‌ వ్యాలీ బ్యాంక్‌, సిగ్నేచర్‌ బ్యాంక్‌లు దివాళా తీయగా.. అదే దారిలో మరికొన్ని బ్యాంకులు  పయనిస్తున్నాయంటూ ఆర్ధిక వేత్తల అంచనాలు బంగారం ధరల పెరుగుదలకు కారణమని తెలుస్తోంది. 

ఇక దేశీయ మార్కెట్‌లో  24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర ఒకే రోజు రూ.1400 పెరిగి రూ.61,100కు చేరింది. వెండి ధర సైతం రూ.1860 పెరిగి రూ.69,340కి చేరింది. ఇటీవల బ్యాంకింగ్‌ రంగంలో చోటుచేసుకుంటున్న వరుస పరిణామాలు బంగారం ధరకు రెక్కలు రావడానికి కారణమయ్యాయి. అనూహ్యంగా పది రోజుల వ్యవధిలోనే పసిడి ధర రూ.56వేల స్థాయి నుంచి రూ.60వేల స్థాయికి చేరింది. ఇక అంతర్జాతీయ మార్కెట్‌లో స్పాట్‌ గోల్డ్‌ 1 శాతం పెరిగి ఔన్స్‌ బంగారం 2,007.30 డాలర‍్లకు చేరింది. అంతకుముందు సెషన్‌లో 1శాతానికి పడిపోయింది. యూఎస్‌ మార్కెట్‌లో 2శాతం పెరిగి 2,012.50డాలర్లకు చేరింది.  

బ్యాంకులు షట్‌డౌన్‌ అవుతాయోమోనన్న భయాలతో మదుపర‍్లు..బ్యాంకుల్లో దాచిన డిపాజిట్లను తిరిగి వెనక్కి తీసుకుంటున్నారు.లాభాదాయకమైన బంగారంపై పెట్టుబడులు పెడుతున్నారు. దీంతో బంగారం ధరలు రాకెట్‌ వేగంతో దూసుకెళ్తున్నాయి. 

చదవండి👉 చుక్కలు చూపిస్తున్న బంగారం ధరలు..ఇప్పుడే ఇలా ఉంటే, మరి రాబోయే రోజుల్లో ఎలా?

మరిన్ని వార్తలు