తెలంగాణను దాటేసిన ఏపీ..!

4 Dec, 2023 16:52 IST|Sakshi

దేశంలో మరోసారి భారీగా జీఎస్టీ వసూళ్లు నమోదయ్యాయి. నవంబరు నెలలో జీఎస్‌టీ వసూళ్లు ఆంధ్రప్రదేశ్‌లో 31%, తెలంగాణలో 18% వృద్ధి నమోదు చేశాయి. కేంద్ర ఆర్థికశాఖ విడుదల చేసిన నవంబరు నెల లెక్కల ప్రకారం ఆంధ్రప్రదేశ్‌ వసూళ్లు గతేడాది నవంబరుతో పోలిస్తే ఈ నవంబరులో రూ.3,134 కోట్ల నుంచి రూ.4,093 కోట్లకు పెరిగాయి. 

ఈ నెలలో దేశవ్యాప్తంగా రూ.1,67,929 కోట్లు వసూలయ్యాయి. ఇందులో సీజీఎస్టీ వాటా రూ.30,420 కోట్లు, ఎస్‌జీఎస్టీ వాటా రూ.38,226 కోట్లు. ఐజీఎస్టీ రూపంలో రూ.87,009 కోట్ల సమకూరగా.. సెస్సుల రూపంలో రూ.12,274 కోట్లు వచ్చినట్లు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ఇటీవల తెలిపింది.

ఐజీఎస్టీ రూపంలో వచ్చిన వసూళ్లను రూ.37,878 కోట్లు సీజీఎస్టీకి, రూ.31,557 కోట్లు ఎస్‌జీఎస్టీ కింద సర్దుబాటు చేసింది. గతేడాది ఇదే నెలతో పోలిస్తే జీఎస్టీ వసూళ్లు 15 శాతం పెరిగాయి. 2023-24 ఆర్థిక సంవత్సరంలో జీఎస్టీ వసూళ్లు రూ.1.60 లక్షల కోట్ల మార్కును దాటడం ఇది ఆరోసారి. రాష్ట్రాల వారీగా రూ.25,585 కోట్లతో మహారాష్ట్ర అగ్రస్థానంలో నిలిచింది. ఆంధ్రప్రదేశ్‌లో నవంబర్‌లో రూ.4,093 కోట్లు వసూళ్లు జరిగాయి. గతేడాది రూ.3,134 కోట్లతో పోలిస్తే 31 శాతం అధికం. తెలంగాణలో గతేడాది రూ.4,228 కోట్లు వసూళ్లు ఈ సారి 18 శాతం వృద్ధితో రూ.4,986 కోట్లు వసూళ్లు నమోదయ్యాయి.

ఇదీ చదవండి: ప్రపంచంలోనే నాసా కంటే ఎక్కువ డేటా ట్రాన్స్‌ఫర్‌..! కానీ..

ఎస్‌జీఎస్‌టీని కేంద్ర, రాష్ట్రాల మధ్య పంపిణీ చేసిన తర్వాత ఏప్రిల్‌-నవంబరు మధ్యకాలంలో ఆంధ్రప్రదేశ్‌కు దక్కిన వాటా 2022తో (రూ.18,742కోట్లు) పోలిస్తే 2023లో (రూ.20,952కోట్లు) 12% పెరిగింది. తెలంగాణకు దక్కిన వాటా రూ.24,460 కోట్ల నుంచి రూ.26,691 కోట్లకు (9%) పెరిగింది. ఎస్‌జీఎస్‌టీ వాటా అన్ని రాష్ట్రాలకూ సగటున 12% వృద్ధి చెందింది.

>
మరిన్ని వార్తలు