ఆ కంపెనీలకు రూ.లక్ష కోట్ల జీఎస్టీ నోటీసులు!

25 Oct, 2023 13:26 IST|Sakshi

పన్ను ఎగవేతలకు పాల్పడిన ఆన్‌లైన్ గేమింగ్ కంపెనీలకు జీఎస్టీ అధికారులు రూ.లక్ష కోట్ల విలువైన షోకాజ్ నోటీసులు జారీ చేసినట్లు సమాచారం. ఇందుకు సంబంధించిన వివరాలను బుధవారం ఓ సీనియర్ అధికారి ధ్రువీకరించారు. ప్రభుత్వం సవరించిన జీఎస్టీ చట్టం ప్రకారం..అక్టోబర్ 1 నుంచి విదేశీ ఆన్‌లైన్ గేమింగ్ కంపెనీలు భారతదేశంలో నమోదు చేసుకోవడం తప్పనిసరి. అయితే, అప్పటినుంచి ఎలాంటి సంస్థలు రిజిస్టర్‌ అవ్వలేదని సమాచారం. 

ఆన్‌లైన్ గేమింగ్ ప్లాట్‌ఫామ్‌ల ద్వారా పెట్టే బెట్టింగ్‌ల పూర్తి విలువపై 28 శాతం జీఎస్‌టీ చెల్లించాలని ఆగస్టులో సవరించారు. కానీ ఇప్పటివరకు పన్ను చెల్లించని గేమింగ్ సంస్థలపై ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. పన్ను చెల్లించని కంపెనీలపై ఇప్పటివరకు సుమారు రూ.1లక్ష కోట్ల విలువైన నోటీసులు పంపింది. 

ఆన్‌లైన్ గేమ్‌లు, గుర్రపు పందేలు, క్యాసినోలు ఆడేందుకు డిపాజిట్ చేసిన మొత్తం నిధులపై 28 శాతం జీఎస్టీ విధించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అప్పటినుంచి దేశంలోని ఆన్‌లైన్ గేమింగ్ కంపెనీలు గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటున్నాయి. మొబైల్ ప్రీమియర్ లీగ్ వంటి కొన్ని సంస్థలు ఉద్యోగులను సైతం వదులుకోవడానికి దారితీసింది. జీఎస్టీ స్లాబ్‌ను తగ్గించాలని, ఇది విదేశీ ఇన్వెస్టర్లలో విశ్వాసాన్ని కోల్పోతుందని గేమింగ్‌ సంస్థలు ప్రభుత్వాన్ని అభ్యర్థించాయి. అయినప్పటికీ, రియల్ మనీ ఆన్‌లైన్ గేమింగ్‌ను నియంత్రించడానికి ప్రభుత్వం అధిక పన్నులతో ముందుకుసాగుతుంది.
 

మరిన్ని వార్తలు