దేశంలో దుమ్మురేపిన హోలీ అమ్మకాలు, చైనాకు రూ.10వేల కోట్ల నష్టం!

20 Mar, 2022 10:20 IST|Sakshi

దేశంలో హోలీ అమ్మకాలు సరికొత్త రికార్డుల నమోదు చేశాయి. కరోనా భయం తొలగి, ప్రజలు హోలీ పండుగను ఘనంగా జరుపుకున్నారని..తద్వారా గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది దేశంలో హోలీ అమ్మకాలు 30శాతం పెరిగాయని ట్రేడ్ బాడీ కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్ (సీఏఐటీ) వెల్లడించింది. అదే సమయంలో  చైనాకు రూ.10వేలకోట్ల నష‍్టం వాటిల్లినిట్లు సీఏఐటీ తెలిపింది.   

మహమ్మారి కారణంగా తీవ్రంగా దెబ్బతిన్న భారతదేశ రిటైల్ రంగానికి ఈ ఏడాది హోలీ అమ్మకాలు ఒక వరంలా మారాయని సీఏఐటీ తెలిపింది."హోలీ పండుగ విక్రయాలు గత ఏడాదితో పోలిస్తే వ్యాపారంలో దాదాపు 30 శాతం వృద్ధిని నమోదు చేశాయి.అంచనా ప్రకారం..హోలీ సందర్భంగా దేశంలో సుమారు రూ.20వేల కోట్ల వ్యాపారం జరిగిందని" ట్రేడ్ బాడీ తెలిపింది.

అంతేకాకుండా, ఏడాది దేశీయ మార్కెట్‌లో చైనా వస్తువుల అమ్మకాలు జరగలేదని స్పష్టం చేసింది. గతంలో దేశీయ మార్కెట్‌లో చైనా ఉత్పుత్తుల హవా ఉండేది.హోలీ వేడుకల​ సందర్భంగా రూ.10వేల కోట్లు జరిగేవి. కానీ ఈ ఏడాది భారత్‌ మార్కెట్‌లో చైనా ఉత్పుత్తులు అమ్మకాలు జరగలేదని సీఏఐటీ ప్రతినిధులు వెల్లడించారు. ఇక హోలీకి ప్రధానంగా రంగులు, బొమ్మలు, బెలూన్లు, హెర్బల్ కలర్స్,గులాల్, వాటర్ గన్, బెలూన్లు, చందన్, డ్రెస్ మెటీరియల్ వంటి దేశీయ వస్తువులు భారీ అమ్మకాలను నమోదు చేసుకున్నాయని చెప్పారు. 

మరోవైపు స్వీట్లు, డ్రై ఫ్రూట్స్, గిఫ్ట్ ఐటమ్స్, టెక్స్‌టైల్స్, పువ్వులు, పండ్లు, బొమ్మలు, ఫర్నిషింగ్ ఫ్యాబ్రిక్, కిరాణా, ఎఫ్‌ఎంసీజీ ఉత్పత్తులు, కన్స్యూమర్ డ్యూరబుల్స్, పూజా సామాగ్రి మొదలైనవి కూడా విపరీతమైన అమ్మకాలు జరిపి భవిష్యత్తులో దేశీయ మార్కెట్‌కి మంచి రోజులొచ్చాయనే సంకేతాలిచ్చినట్లైందని సీఏఐటీ సెక్రటరీ జనరల్ ప్రవీణ్ ఖండేల్‌వాల్ అన్నారు.

హోలీ రోజున మంచి అమ్మకాలను చూసిన తర్వాత దేశవ్యాప్తంగా వ్యాపారులు ఏప్రిల్-మేలో రాబోయే వివాహ సీజన్ కోసం సిద్ధమవుతున్నారు. ఇది భవిష్యత్‌ రోజుల్లో జరిగే వ్యాపారాలకు మరింత సహాయపడుతుందని ఆశిస్తున్నారు. దేశవ్యాప్తంగా 40వేల వాణిజ్య సంఘాలు,8 కోట్ల మంది వ్యాపారులకు ప్రాతినిధ్యం వహిస్తున్నట్లు సీఏఐటీ పేర్కొంది. కరోనా నుంచి దేశం సురక్షితంగా ఉన్నందునే  హోలీ వేడుకలు ఘనంగా జరిగాయని ఖండేల్వాల్ అభిప్రాయం వ్యక్తం చేశారు.

చదవండి: ఐఫోన్‌ యూజర్లకు కొత్త సమస్య! యాపిల్‌పై ఆగ్రహం..!

మరిన్ని వార్తలు