CNG Bike: విడుదలకు సిద్దమవుతున్న ఫస్ట్ సీఎన్‌జీ బైక్ - వివరాలు

19 Oct, 2023 15:24 IST|Sakshi

భారతీయ మార్కెట్లో ఇప్పటి వరకు పెట్రోల్ బైకులు మాత్రమే వినియోగంలో ఉన్నాయి. పెట్రోల్ ధరలు రోజు రోజుకి పెరుగుతున్న తరుణంలో ప్రముఖ బైక్ తయారీ సంస్థ బజాజ్ సీఎన్‌జీ విభాగంలో బైకుని విడుదల చేయడానికి సన్నద్ధమవుతోంది.

బ్రుజెర్ ఈ101 (Bruzer E101) కోడ్‌నేమ్‌తో రానున్న ఈ కొత్త సీఎన్‌జీ బైకుని ఔరంగాబాద్ ఫ్యాక్టరీలో తయారు చేస్తున్నట్లు, ప్రస్తుతం దాదాపు చివరి దశకు చేరుకుందని సమాచారం. కాబట్టి వచ్చే ఏడాది ఈ బైక్ అధికారికంగా మార్కెట్లో ప్లాటినా పేరుతో విడుదలయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. 

బజాజ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రాకేష్ శర్మ ఈ బైక్ గురించి మాట్లాడుతూ.. గత కొన్ని సంవత్సరాలుగా దిగుమతులను, కాలుష్యాన్ని తగ్గించడంలో దేశం ఎదుర్కొంటున్న సవాళ్లను కంపెనీ గుర్తించిందని, దీనిని దృష్టిలో ఉంచుకుని సీఎన్‌జీ బైకుని తీసుకురావడానికి సంకల్పించినట్లు వెల్లడించాడు.

సంవత్సరానికి సుమారు ఒక లక్ష నుంచి 1.2 లక్షల సీఎన్‌జీ బైకులను ఉత్పత్తి చేయాలనుకున్నట్లు, ఇది రెండు లక్షల యూనిట్లకు చేరుకునే అవకాశం ఉందని చెబుతున్నారు. మార్కెట్లో డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని ఉత్పత్తి మరింత పెరిగే అవకాశం ఉంటుంది.

ఇదీ చదవండి: కొత్త హంగులతో మెరిసిపోతున్న 'ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్' - ఫోటోలు చూశారా?

పెట్రోల్ ధరలతో పోలిస్తే సీఎన్‌జీ ధరలు తక్కువ. ఇది మాత్రమే కాకుండా పెట్రోల్ వాహనాల కంటే సీఎన్‌జీ వాహనాల మైలేజ్ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి సీఎన్‌జీ బైక్ మైలేజ్ దాని మునుపటి మోడల్స్ కంటే ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. ఖచ్చితమైన గణాంకాలు, ఇతర వివరాలు లాంచ్ సమయంలో తెలుస్తాయి.

మరిన్ని వార్తలు