ఐవోబీ లాభం ప్లస్‌.. క్యూ3లో రూ. 555 కోట్లు

10 Feb, 2023 07:57 IST|Sakshi

న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ సంస్థ ఇండియన్‌ ఓవర్‌సీస్‌ బ్యాంక్‌(ఐవోబీ) ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2022–23) మూడో త్రైమాసికంలో పటిష్ట ఫలితాలు సాధించింది. అక్టోబర్‌–డిసెంబర్‌(క్యూ3)లో నికర లాభం 22 శాతం ఎగసి రూ. 555 కోట్లకు చేరింది. గతేడాది(2021–22) ఇదే కాలంలో రూ. 454 కోట్లు ఆర్జించింది. వడ్డీ ఆదాయం, రుణాల నాణ్యత మెరుగుపడటం ఇందుకు సహకరించింది. మొత్తం ఆదాయం రూ. 5,317 కోట్ల నుంచి రూ. 6,006 కోట్లకు పుంజుకుంది.

నికర వడ్డీ ఆదాయం 44 శాతం జంప్‌చేసి రూ. 2,272 కోట్లను తాకింది. నికర వడ్డీ మార్జిన్లు 0.71 శాతం బలపడి 3.27 శాతానికి చేరాయి. స్థూల మొండిబకాయిలు 10.4 శాతం నుంచి 8.19 శాతానికి దిగివచ్చాయి. నికర ఎన్‌పీఏలు సైతం 2.63 శాతం నుంచి 2.43 శాతానికి బలహీనపడ్డాయి. మొండి రుణాలకు కేటాయింపులు రూ. 937 కోట్ల నుంచి రూ. 711 కోట్లకు తగ్గాయి. కనీస మూలధన నిష్పత్తి 15.16 శాతంగా
నమోదైంది. 
ఫలితాల నేపథ్యంలో ఐవోబీ షేరు ఎన్‌ఎస్‌ఈలో 1 శాతం బలపడి రూ. 27.15 వద్ద ముగిసింది.

మరిన్ని వార్తలు