భారత్‌పై అంతర్జాతీయ ఐటీ సంస్థ దృష్టి - వచ్చే ఏడాది నుంచి..

18 Nov, 2023 07:09 IST|Sakshi

న్యూఢిల్లీ: అంతర్జాతీయ ఐటీ సంస్థ ఇన్నోవా సొల్యూషన్స్‌ భారత మార్కెట్‌పై మరింతగా దృష్టి పెడుతోంది. వచ్చే ఏడాది (2024) ఇక్కడ కార్యకలాపాలను విస్తరించడంతో పాటు పెద్ద ఎత్తున నియామకాలను కూడా చేపట్టనుంది. సంస్థ సీనియర్‌ వైస్‌ ప్రెసిడెంట్, భారత విభాగం హెడ్‌ ప్రదీప్‌ యడ్లపాటి ఈ విషయాలు తెలిపారు.

అమెరికాలోని జార్జియా కేంద్రంగా పనిచేస్తున్న ఇన్నోవా సొల్యూషన్స్‌ 1998లో ప్రారంభమైంది. 2010లో పేరోల్‌ సిస్టమ్స్, 2016లో టెక్నాలజీ సొల్యూషన్స్‌ విభాగంలోకి కంపెనీ ప్రవేశించింది. బీఎఫ్‌ఎస్‌ఐ (బ్యాంకింగ్, ఫైనాన్షియల్‌ సర్వీసెస్, బీమా), కమ్యూనికేషన్స్, మీడియా తదితర రంగాల్లో వెయ్యికి పైగా క్లయింట్లకు సేవలు అందిస్తోంది.

ప్రస్తుతం అమెరికా, భారత్‌తో పాటు ఆస్ట్రేలియా, సింగపూర్‌ తదితర దేశాల్లో 100 పైచిలుకు కార్యాలయాలు ఉన్నాయి. అంతర్జాతీయంగా 55,000 మంది పైచిలుకు ఉద్యోగులు ఉండగా.. భారత్‌లో 10,000 మంది సిబ్బంది ఉన్నారు. భారత్, ఆసియా–పసిఫిక్‌లోని తమ కార్యకలాపాల పర్యవేక్షణ కోసం ఈ ఏడాది తొలినాళ్లలో ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్‌లో కీలక హోదాలో ఉన్న యడ్లపాటిని నియమించుకుంది.

మరిన్ని వార్తలు