పార్లమెంట్ (రెండు భాగాల) బడ్జెట్ సమావేశాలు జనవరి 31న ప్రారంభమవుతున్న నేపథ్యంలో రాబోయే కేంద్ర బడ్జెట్లో హెల్మెట్లపై విధించిన వస్తు సేవల పన్ను (జీఎస్టీని) తొలగించాలని ఇంటర్నేషనల్ రోడ్ ఫెడరేషన్ (ఐఆర్ఎఫ్) ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది.
ఈ మేరకు బడ్జెట్లో నిర్ణయం ఉండాలని కోరుతూ ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్కు ఒక లేఖ రాసినట్లు ఐఆర్ఎఫ్ ఒక ప్రకటనలో తెలిపింది. సురక్షితమైన రహదారుల కోసం ఐఆర్ఎఫ్ కృషి చేస్తోంది. ప్రస్తుతం హెల్మెట్లపై 18 శాతం జీఎస్టీ అమలవుతోంది.
ప్రపంచవ్యాప్తంగా సంభవించే రోడ్డు ప్రమాద మరణాలలో భారత్ 11 శాతం వాటా కలిగి ఉందని ఐఆర్ఎఫ్ ఎమెరిటస్ ప్రెసిడెంట్ కేకే కపిల ఈ సందర్భంగా పేర్కొన్నారు. ద్విచక్ర వాహనదారుల విషయంలో ఇది దాదాపు 31.4 శాతంగా ఉందన్నారు.