ఐవోసీ రైట్స్‌కు బోర్డు ఓకే

8 Jul, 2023 05:57 IST|Sakshi

రూ. 22,000 కోట్ల సమీకరణకు సై 

ఇప్పటికే బీపీసీఎల్‌ రైట్స్‌కు గ్రీన్‌సిగ్నల్‌

న్యూఢిల్లీ: ఇంధన రంగ ప్రభుత్వ దిగ్గజం ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌(ఐవోసీ) రైట్స్‌ ఇష్యూ చేపట్టనుంది. ఇందుకు బోర్డు అనుమతించినట్లు తాజాగా వెల్లడించింది. తద్వారా రూ. 22,000 కోట్లు సమీకరించనున్నట్లు తెలియజేసింది. ఇటీవల రైట్స్‌ ఇష్యూకి వెళ్లేందుకు మరో చమురు పీఎస్‌యూ భారత్‌ పెట్రోలియం కార్పొరేషన్‌(బీపీసీఎల్‌) బోర్డు సైతం అనుమతినివ్వగా.. నంబర్‌ వన్‌ కంపెనీ ఐవోసీ తాజాగా జత కలిసింది.

వెరసి రెండు సంస్థలూ ఈక్విటీ షేర్ల జారీ ద్వారా భారీగా పెట్టుబడులను సమకూర్చుకోనున్నాయి. రైట్స్‌ జారీ ద్వారా వివిధ ప్రాజెక్టుల పెట్టుబడి వ్యయాలకు నిధులు సమకూర్చుకోనున్నట్లు ఐవోసీ పేర్కొంది. వెరసి కంపెనీలో ప్రమోటర్‌గా కేంద్ర ప్రభుత్వం సైతం రైట్స్‌కు సబ్ర్‌స్కయిబ్‌ చేయడం ద్వారా పెట్టుబడులు సమకూర్చనుంది. కర్బన ఉద్గారరహిత ప్రాజెక్టుల కోసం కేంద్ర ప్రభుత్వం చమురు పీఎస్‌యూలకు పెట్టుబడులు అందించే ప్రణాళికల్లో ఉన్న నేపథ్యంలో రైట్స్‌ ప్రతిపాదనలకు ప్రాధాన్యం ఏర్పడింది.  

రూ. 18,000 కోట్లకు సై
పీఎస్‌యూ దిగ్గజం బీపీసీఎల్‌ బోర్డు గత నెల (జూన్‌) 28న రైట్స్‌ ఇష్యూకి అనుమతించింది. తద్వారా కంపెనీ రూ. 18,000 కోట్లు సమీకరించేందుకు గ్రీన్‌సిగ్నల్‌ లభించింది. ప్రభుత్వం వార్షిక బడ్జెట్‌లో ఇంధన రంగ పీఎస్‌యూలు బీపీసీఎల్, ఐవోసీ, హెచ్‌పీసీఎల్‌లకు మొత్తం రూ. 30,000 కోట్ల పెట్టుబడులు సమకూర్చుకునేందుకు ప్రతిపా దించిన సంగతి తెలిసిందే. తద్వారా కర్బన ఉద్గార రహిత సన్నాహాలకు మద్దతిచ్చేందుకు నిర్ణయించింది. ఇక ఓఎన్‌జీసీకి మెజారిటీ వాటా గల మరో పీఎస్‌యూ హెచ్‌పీసీఎల్‌.. ప్రిఫరెన్షియల్‌ షేర్ల జారీ ద్వారా ప్రభుత్వ పెట్టుబడులు సమకూర్చుకునే వ్యూహాల్లో ఉంది.  కాగా.. గత నెలలో ఐవోసీ అధీకృత వాటా మూలధనాన్ని రెట్టింపునకు అంటే రూ. 30,000 కోట్లకు పెంచుకున్న సంగతి తెలిసిందే.  
 

జేవీ బాటలో
దేశీయంగా బ్యాటరీ స్వాపింగ్‌ బిజినెస్‌ నిర్వహించేందుకు భాగస్వామ్య సంస్థ(జేవీ)ను ఏర్పాటు చేయనున్నట్లు ఐవోసీ పేర్కొంది. ఇందుకు బోర్డు తాజాగా అనుమతించినట్లు వెల్లడించింది. సన్‌ మొబిలిటీ పీటీఈ లిమిటెడ్, సింగపూర్‌తో సమాన భాగస్వామ్యాన(50:50 శాతం వాటా) ప్రయివేట్‌ రంగ జేవీకి తెరతీయనున్నట్లు వివరించింది. 2026–27 ఆర్థిక సంవత్సరంవరకూ రూ. 1,800 కోట్ల ఈక్విటీ పెట్టుబడులతో జేవీని ఏరా>్పటు చేయనున్నట్లు తెలియజేసింది. సొంత అనుబంధ సంస్థ ఐవోసీఎల్‌ సింగపూర్‌ పీటీఈ లిమిటెడ్, సింగపూర్‌లో ఫ్రిఫరెన్స్‌ షేర్లు, వారంట్ల ద్వారా 78.31 మిలియన్‌ డాలర్లు ఇన్వెస్ట్‌ చేసేందుకు సైతం బోర్డు ఓకే చెప్పినట్లు వెల్లడించింది.
 ఈ వార్తల నేపథ్యంలో ఐవోసీ షేరు ఎన్‌ఎస్‌ఈలో 0.8 శాతం బలపడి రూ. 99.40 వద్ద ముగిసింది.

13న ఎన్‌ఎస్‌ఈలో త్రిధ్య లిస్టింగ్‌
  ఐపీవోతో రూ. 26 కోట్లు సమీకరణ
సాఫ్ట్‌వేర్‌ డెవలప్‌మెంట్‌ సంస్థ త్రిధ్య టెక్‌ ఎన్‌ఎస్‌ఈ ఎస్‌ఎంఈ ప్లాట్‌ఫామ్‌ ద్వారా ఈ నెల 13న లిస్ట్‌కానుంది. కంపెనీ షేరుకి రూ. 35–42 ధరలో చేపట్టిన పబ్లిక్‌ ఇష్యూ ద్వారా రూ. 26.41 కోట్లు సమకూర్చుకుంది. ఇష్యూలో భాగంగా 62.88 లక్షల షేర్లను విక్రయించింది. జూన్‌ 30– జూలై 5 మధ్య చేపట్టిన ఇష్యూకి 72 రెట్లు అధిక స్పందన లభించింది. ప్రధానంగా సంస్థాగతేతర, రిటైల్‌ ఇన్వెస్టర్ల నుంచి భారీ స్పందన లభించినట్లు కంపెనీ వెల్లడించింది. నిధులను రుణాల చెల్లింపు, సాధారణ కార్పొరేట్‌ అవసరాలకు వినియోగించనుంది. సంస్థాగతేతర ఇన్వెస్టర్ల నుంచి 183 రెట్లు, రిటైలర్ల నుంచి 68 రెట్లు అధికంగా బిడ్స్‌ దాఖలైనట్లు కంపెనీ వెల్లడించింది. అర్హతగల సంస్థాగత కొనుగోలుదారుల(క్విబ్‌) విభాగంలో 16 రెట్లు అధిక స్పందన నమోదైంది.

కాకా ఇండస్ట్రీస్‌ ఐపీవో 10న
షేరుకి రూ. 55–58 ధరల శ్రేణి
న్యూఢిల్లీ: పాలిమర్‌ ఆధారిత ప్రొఫైల్స్‌ తయారీ కంపెనీ కాకా ఇండస్ట్రీస్‌ పబ్లిక్‌ ఇష్యూ ఈ నెల 10న(సోమవారం) ప్రారంభంకానుంది. 12న (బుధవారం) ముగియనున్న ఇష్యూకి ధరల శ్రే ణి రూ. 55–58కాగా.. చిన్న, మధ్యతరహా సంస్థ ల కోసం ఏర్పాటైన బీఎస్‌ఈ ఎస్‌ఎంఈ ప్లాట్‌ఫా మ్‌ ద్వారా లిస్ట్‌కానుంది. ఇష్యూలో భాగంగా కంపెనీ 36.6 లక్షల షేర్లను విక్రయానికి ఉంచనుంది. తద్వారా రూ.21.23 కోట్లు సమీకరించే యోచనలో ఉంది.

మరిన్ని వార్తలు