ఝన్‌ఝన్‌వాలా జాక్‌పాట్‌:టైటన్‌ మెరిసెన్‌

6 Aug, 2022 10:49 IST|Sakshi

13 రెట్లు పెరిగిన లాభం

ఫెస్టివ్‌ సీజన్‌ డిమాండ్‌తో భారీ లాభాలు

న్యూఢిల్లీ: ఆభరణాలు, వాచ్‌లు, కళ్లద్దాలు తదితర వేరబుల్‌ ఉత్పత్తుల విక్రయంలోని ప్రముఖ కంపెనీ టైటాన్‌ జూన్‌ త్రైమాసికంలో పనితీరు పరంగా మెప్పించింది.దేశంలోని అతిపెద్ద బ్రాండెడ్ ఆభరణాల తయారీదారు అంతక్రితం ఏడాది ఇదే కాలంతో పోలిస్తే లాభం 13 రెట్లు పెరిగి రూ.790 కోట్లుగా నమోదైంది. ఆదాయం కూడా మూడు రెట్ల వృద్ధితో రూ.9,487 కోట్లకు చేరింది. అంతక్రితం ఆర్థిక సంవత్సరం ఇదే త్రైమాసికంలో లాభం రూ.18 కోట్లు, ఆదాయం రూ.3,519 కోట్ల చొప్పున ఉన్నాయి.

జ్యుయలరీ విభాగం ఆదాయం రూ.8,351 కోట్లుగా ఉంది. ఇది అంతక్రితం ఏడాది ఇదే కాలానికి రూ.3,050 కోట్లుగా ఉంది. వాచ్‌లు, వేరబుల్‌ కేటగిరీ ఆదాయం రూ.293 కోట్ల నుంచి రూ.786 కోట్లకు వృద్ధి చెందింది. కళ్లద్దాల విభాగం నుంచి ఆదాయం రూ.183 కోట్లకు పెరిగింది. అంతక్రితం రెండు ఆర్థిక సంవత్సరాల్లోనూ మొదటి త్రైమాసికంపై కరోనా మహమ్మారి ప్రభావం ఉందని.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం జూన్‌లో సాధారణ వ్యాపార కార్యకలాపాలు ఉండడం మెరుగైన పనితీరుకు దోహదపడినట్టు కంపెనీ తెలిపింది.  

కాగా Trendlyne ప్రకారం, జూన్ 30 నాటికి ఝన్‌ఝన్‌వాలా, ఆయన భార్య  రేఖ టైటాన్ ఎన్‌ఎస్‌ఇలో 0.38 శాతం 5.05 శాతం వాటాను కలిగి ఉన్నారు, దీని విలువ శుక్రవారం  నాటికి రూ. 10,937 కోట్లు కావడం విశేషం.

మరిన్ని వార్తలు