స్విగ్గీ ఉద్యోగాల ఊచకోత: 380 మందిపై వేటు

20 Jan, 2023 15:19 IST|Sakshi

సాక్షి,ముంబై: ప్రముఖ ఫుడ్‌ డెలీవరీ యాప్‌ స్విగ్గీ కూడా ఉద్యోగులపై వేటుకు నిర్ణయం తీసుకుంది. సంస్థ పునర్నిర్మాణం, అంచనాలతో పోలిస్తే  తక్కువ వృద్ధి రేటు తదితర  కారణాలతో ఈ కఠిన నిర్ణయం  తీసుకున్నట్టు సంస్థ ప్రకటించింది.

లాభదాయకత,లక్ష్యాలను చేరుకోనే క్రమంలో మొత్తం పరోక్ష ఖర్చులను పునః పరిశీలించాల్సిన అవసరం ఉందని కంపెనీ సీఈవో శ్రీహర్ష మెజెటీ శుక్రవారం ఉద్యోగులకు అందించిన ఈమెయిల్‌ సందేశంలో చెప్పారు. 380 మంది ఉద్యోగులను తొలగిస్తున్నట్లు అందుబాటులో ఉన్నఅన్ని ఎంపికలను అన్వేషించిన తర్వాత ఇంత కష్టమైన నిర్ణయం తీసుకున్నట్టు   సీఈవో  తెలిపారు. ప్రొడక్ట్‌, ఇంజినీరింగ్‌, ఆపరేషన్‌ డిపార్ట్‌మెంట్స్‌ ఉద్యోగులు ఎక్కువు ప్రభావితమైనట్టు సమాచారం. అంతేకాదు త్వరలోనే మీట్‌ మార్కెట్‌ను మూసివేయనుంది. అయితే ఇన్‌స్టామార్ట్‌ ద్వారా ఆ విక్రయాలు కొనసాగుతాయని ఆయన తెలిపారు. కొత్త విభాగాల్లో తమ పెట్టుబడులు కొనసాగుతాయని  వెల్లడించింది.

అలాగే హైరింగ్ విషయంలో కొన్ని తప్పులు చేశాననీ, ఈ విషయంలో  కొంచెం జాగ్రత్తగా ఉండి ఉండాల్సిందని శ్రీహర్ష వెల్లడించారు. ప్రభావితమైన ఉద్యోగులు  అందరికీ మూడు నెలల కనీస హామీ చెల్లింపు, పదవీకాలం,  గ్రేడ్ ఆధారంగా 3-6 నెలల  నగదు చెల్లింపు చేస్తున్నట్టు కంపెనీ తెలిపింది.

రాబోయే మూడు నెలల పాటు కెరీర్ ట్రాన్సిషన్ సపోర్ట్,  పునరావాస ఖర్చులు రీయింబర్స్ చేస్తామనీ, కొత్త ఉద్యోగాన్ని వెతుక్కునే పనిలో సహాయపడటానికి వారికి కేటాయించిన పని ల్యాప్‌టాప్‌లను ఉపయోగించుకోవచ్చని స్పష్టం చేసింది. ఐపీఓకు ముందు  ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం.

మరిన్ని వార్తలు