Gold Mines In India: మనదేశంలో బంగారు గనులు ఎక‍్కడున్నాయో తెలిస్తే ఆశ్చర్యపోతారు!!

18 Mar, 2022 12:26 IST|Sakshi

గనుల మంత్రిత్వ శాఖ ప్రచురించిన డేటా ప్రకారం, భారత్‌లో నిర్ధారించిన ప్రస్తుత బంగారం మైనింగ్‌ నిల్వల పరిమాణం 70.1 టన్నులు. ఇందులో 88 శాతం కర్ణాటకలో ఉంది. మరో 12 శాతం ఆంధ్రప్రదేశ్‌లో ఉంది.  చాలా తక్కువ మొత్తం (0.1టన్ను కంటే తక్కువ) జార్ఖండ్‌లో కనుగొనడం జరిగింది. 

1947లో పునఃప్రారంభించబడినప్పటి నుండి 2020 వరకు, కర్ణాటకలోని రాయచూర్‌ జిల్లాలో ఉన్న హట్టి గోల్డ్‌ మైన్‌ దాదాపు 84 టన్నుల బంగారాన్ని ఉత్పత్తి చేసింది. ఈ మైన్‌ ప్రస్తుతం భారతదేశంలోని ఏకైక ముఖ్యమైన బంగారు ఉత్పత్తిదారుగా ఉంది. భారత్‌ తన మొత్తం పసిడి డిమాండ్‌లో 80 శాతంపైగా దిగుమతులపైనే ఆధారపడుతోంది.

రత్నాలు ఆభరణాల ఎగుమతుల అభివృద్ధి మండలి (జీజేఈపీసీ)ఇటీవల విడుదల చేసిన నివేదిక ప్రకారం భారత్‌ 2021లో 1,067 టన్నుల దిగుమతులు చేసుకుంది. కోవిడ్‌–19 తీవ్ర ప్రతికూల ప్రభావాన్ని ఎదుర్కొన్న 2020లో ఈ పరిమాణం కేవలం 430.11 టన్నులు. 2019తో పోల్చిచూస్తే, 28 శాతం పెరిగి 836.38 టన్నులుగా నమోదయ్యింది. ఎగుమతుల విషయానికొస్తే, 2021లో బంగారు ఆభరణాలకు డిమాండ్‌ పెరగడంతో దేశం నుండి ఈ విభాగంలో రవాణా 50 శాతం పెరిగి  8,807.50 మిలియన్ల డాలర్లకు చేరుకుంది.

చదవండి: భారత్‌లో గోల్డ్‌ మైనింగ్‌ బంగారమవుతుంది.. కానీ!

మరిన్ని వార్తలు