Meesho: మీషో.. ‘సూపర్‌’ షో, ఇక కిరాణా సామాగ్రి కూడా కొనొచ్చు!

6 Apr, 2022 09:25 IST|Sakshi

న్యూఢిల్లీ: సాఫ్ట్‌బ్యాంక్‌ పెట్టుబడులున్న మీషో ఆన్‌లైన్‌ గ్రోసరీ విభాగంలో భారీగా విస్తరించేందుకు సిద్ధపడుతోంది. ఒకే చోట అన్నీ లభించేలా వేసుకున్న ప్రణాళికల్లో భాగంగా కీలక యాప్‌ ద్వారా గ్రోసరీ విభాగాన్ని సమీకృతం చేయనున్నట్లు మీషో పేర్కొంది. దేశీయంగా తదుపరి 100 కోట్ల(బిలియన్‌) యూజర్లకు సింగిల్‌ షాపింగ్‌ కేంద్రంగా నిలవాలని ఆశిస్తున్నట్లు తెలియజేసింది. మే నెల తొలి వారానికల్లా గ్రోసరీ బిజినెస్‌ ఇంటిగ్రేషన్‌ను పూర్తి చేయనున్నట్లు వెల్లడించింది. దీంతో ఫార్మిసోను మీషో సూపర్‌స్టోర్‌గా రీబ్రాండ్‌ చేయనున్నట్లు పేర్కొంది.  

కర్ణాటకలో షురూ: తొలుత కర్ణాటకలో పరిశీలనాత్మకంగా కీలక యాప్‌తో మీషో సూపర్‌స్టోర్‌ను జత చేసినట్లు మీషో వ్యవస్థాపక సీఈవో విదిత్‌ ఆట్రే తెలియజేశారు. తాజా పండ్లు, కూరగాయలు, హోమ్‌ కేర్, ప్యాకేజ్‌డ్‌ ఫుడ్, గ్రోసరీ సంబంధిత 500 ప్రొడక్టులను అందిస్తున్నట్లు పేర్కొన్నారు. 

9 నెలల్లోపే మహారాష్ట్ర, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, గుజరాత్, మధ్యప్రదేశ్‌లలోనూ యూజర్లను ఆకట్టుకుంటున్నట్లు తెలియజేశారు. 2022 చివరికల్లా 12 రాష్ట్రాలకు విస్తరించనున్నట్లు మీషో తెలియజేసింది. ప్రస్తుత ఇంటిగ్రేషన్‌తో 10 కోట్లకుపైగా యూజర్లు 8.7 కోట్ల ప్రొడక్ట్‌ లిస్టింగ్స్‌ను ఒకే ప్లాట్‌ఫామ్‌పై పొందవచ్చని వివరించింది.

మరిన్ని వార్తలు