ప్రత్యక్ష పన్నులు : రూ.10.65 లక్షల కోట్లు  

16 Dec, 2023 07:54 IST|Sakshi

న్యూఢిల్లీ: ప్రత్యక్ష పన్ను నికర వసూళ్లు ఏప్రిల్‌ నుంచి నవంబర్‌ వరకూ గడచిన ఆర్థిక సంవత్సరం ఎనిమిది నెలల్లో రూ.10.65 లక్షల కోట్లుగా నమోదయ్యాయి. 2023–24 బడ్జెట్‌ మొత్తం అంచనాల్లో ఇది 58.34 శాతం. కాగా రిఫండ్స్‌ రూ.2.03 లక్షల కోట్లు కూడా కలుపుకుంటే, స్థూలంగా పన్ను వసూళ్లు 2022–23 ఇదే కాలంలో పోలి్చతే 17.7 శాతం పెరిగి రూ.12.67 లక్షల కోట్లుగా నమోదయ్యాయి.

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం కేంద్రం రూ.18.23 లక్షల కోట్ల ప్రత్యక్ష పన్ను (వ్యక్తిగత ఆదాయ, కార్పొరేట్‌ పన్నులు) వసూళ్లను లక్ష్యంగా పెట్టుకుంది. పరోక్ష పన్నుల (వస్తు సేవల పన్ను, కస్టమ్స్, ఎక్సైజ్‌) వసూళ్ల లక్ష్యం రూ.15.38 లక్షల కోట్లు. వెరసి మొత్తం పన్ను వసూళ్ల లక్ష్యం రూ. 33.61 లక్షల కోట్లు.  బడ్జెట్‌ సవరిత అంచనాల ప్రకారం ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2023–24) రూ. 33.61 లక్షల కోట్ల పన్ను వసూళ్ల లక్ష్యానికి ప్రభుత్వం కట్టుబడి ఉంటుందని సీనియర్‌ అధికారి ఒకరు తెలిపారు.  ఆర్థిక సంవత్సరం మొదటి ఎనిమిది నెలలూ చూస్తే (ఏప్రిల్‌–నవంబర్‌) ప్రత్యక్ష పన్ను వసూళ్లు దాదాపు 20 శాతం పెరిగాయి.  పరోక్ష పన్ను 5 శాతం అధికంగా నమోదయ్యాయి.

ఈ నేపథ్యంలో బడ్జెట్‌లో నిర్దేశించుకున్న పన్ను వసూళ్ల లక్ష్యానికి కట్టుబడి ఉన్నట్లు పేర్కొన్నారు. 2022–23 ఆర్థిక సంవత్సరంలో పన్ను వసూళ్ల మొత్తం రూ.30.54 లక్షల కోట్లు. 2023–24లో దీనిని 10 శాతం (రూ.33.61 లక్షల కోట్లు) పెంచాలన్న లక్ష్యాన్ని బడ్జెట్‌ నిర్దేశించుకుంది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ఫిబ్రవరి 1వ తేదీన లోక్‌సభలో ఓట్‌ ఆన్‌ అకౌంట్‌ లేదా మధ్యంతర బడ్జెట్‌ను ప్రవేశపెట్టే అవకాశం ఉన్న సంగతి తెలిసిందే.  లోక్‌సభకు ఎన్నికల అనంతరం కొలువుదీరే నూతన ప్రభుత్వం పూర్తి స్థాయి బడ్జెట్‌ను ప్రవేశపెడుతుంది.  
 

>
మరిన్ని వార్తలు