విస్తరిస్తున్న నోకియా: త్వరలో మరిన్ని ఉత్పత్తులు

24 Dec, 2020 15:04 IST|Sakshi

ఫ్రిజ్‌లు, వ్యాక్యూమ్‌ క్లీనర్లు, డిష్‌ వాషర్లు

ఇప్పటికే  నోకియా ఏసీలు, ల్యాప్‌  టాప్‌లు

సాక్షి, ముంబై: ప్రముఖ సంస్థ నోకియా వ్యాపార విస్తరణలో దూకుడును ప్రదర్శిస్తోంది. భారతదేశంలో, నోకియా స్మార్ట్  టీవీలు, ఏసీలు ల్యాప్‌టాప్‌ల కోసం ఫ్లిప్‌కార్ట్‌లో భాగస్వామ్యాన్ని ఇటీవల ప్రకటించిన నోకియా తాజాగా మరికొన్ని ఎలక్ట్రానిక్‌ ఉత్పత్తులను లాంచ్‌ చేయనుంది. త్వరలో రిఫ్రిజరేటర్లు,  వ్యాక్యూమ్‌ క్లీనర్లు,  డిష్‌ వాషర్లు లాంటి వంటి ఉపకరణాలను  మార్కెట్లో   ప్రారంభించనుంది. ఈ మేరకు నోకియా బ్రాండ్ పార్ట్‌నర్‌షిప్స్‌ హెడ్‌ విపుల్ మెహ్రోత్రా ధృవీకరించారు.

మైక్రోసాఫ్ట్ నుండి బయటపడిన తరువాత, నోకియా మరింత విస్తరిస్తోంది. తన వ్యాపారాన్ని ప్రపంచవ్యాప్తంగా వేర్వేరు లైసెన్సులతో   రీబ్రాండ్‌ అవుతూ పూర్వ వైభవాన్ని దక్కించుకునేందుకు యోచిస్తోంది.  ఈ క్రమంలోనే నోకియా స్మార్ట్‌ఫోన్లు మొదలు, నోకియా టెలివిజన్లు, నోకియా స్ట్రీమింగ్ పరికరాలు, నోకియా ల్యాప్‌టాప్‌లు, ఎయిర్ కండీషనర్లు,  ఫ్రిజ్‌లను, డిష్‌ వాషర్ల వరకు భారతీయ వినియోగదారులకు అందుబాటులోకి తీసుకొస్తోంది.

ఫ్లిప్‌కార్ట్‌తో నోకియా భాగస్వామ్యంపై మెహ్రోత్రా మాట్లాడుతూ, దేశంలో, ఫ్లిప్‌కార్ట్ మొట్టమొదటి నోకియా బ్రాండెడ్ ఆండ్రాయిడ్ ఆధారిత స్మార్ట్ టీవీని గత సంవత్సరం విడుదల చేసిందనీ, ఆ తర్వాత ఆరు నెలల క్రితం మీడియా స్ట్రీమర్‌లు, గత రెండు నెలల్లో ఆరు కొత్త స్మార్ట్  టీవీలను ఆవిష్కరించినట్టు తెలిపారు. అంతేకాదు   ఇటీవలి పండుగ సీజన్ అమ్మకాలలో, నోకియా బ్రాండెడ్ స్మార్ట్ టీవీలు ఫ్లిప్‌కార్ట్‌లో అత్యధికంగా అమ్ముడైన ఐదు టీవీలలో ఒకటని వెల్లడించారు. కరోనావైరస్ మహమ్మారి వల్ల ఆలస్యం జరిగినప్పటికీ ఇంకా వాక్యూమ్ క్లీనర్, ఎలక్ట్రిక్ టూత్ బ్రష్, స్మార్ట్ లైట్లు,  స్మార్ట్ ప్లగ్స్ వంటి స్మార్ట్ ఉపకరణాలను కూడా తీసుకొస్తామన్నారు.

మరిన్ని వార్తలు