LPG Price Hike: షాకిచ్చిన చమురు కంపెనీలు.. కమర్షియల్‌ గ్యాస్‌ సిలిండర్‌ ధర పెంపు

1 Mar, 2022 10:42 IST|Sakshi

Oil Companies Hike LPG Price: రష్యా - ఉక్రెయిన్‌ యుద్ధం నేపథ్యంలో అంతా భయపడుతున్నట్టే జరిగింది. ధరల పెంపు నిర్ణయాన్ని ముందుగా చమురు కంపెనీలు ప్రకటించాయి. వాణిజ్య సిలిండర్‌ ధరలు పెంచుతూ సోమవారం చమురు కంపెనీలు నిర్ణయం తీసుకున్నాయి. పెరిగిన ధరలు 2022 మార్చి 1 నుంచి అమల్లోకి వస్తాయని ప్రకటించాయి. 

కమర్షియల్‌ గ్యాస్‌ సిలిండర్‌ ధరలను పెంచాయి చమురు కంపెనీలు. 19 కేజీల సిలిండర్‌ ధరపై రూ. 105లు , 5 కేజీల సిలిండర్‌పై రూ. 27 వంతున ధర పెంచాయి. దీంతో దేశ రాజధానిలో కమర్షియల్‌ సిలిండర్‌ ధర రెండు వేలు దాటింది. 19 కేజీ సిలిండర్‌ ధర రూ. 2,012కి చేరగా 5 కేజీల సిలిండర్‌ ధర రూ. 569గా ఉంది. పెరిగిన ధరలను పరిగణలోకి తీసుకుని వివిధ నగరాల వారీగా 19 కేజీలు సిలిండర్ల ధరను  పరిశీలిస్తే చెన్నైలో రూ. 2185, ముంబై రూ.1962 , కోల్‌కతా రూ.2089లు, హైదరాబాద్‌లో రూ.1904లుగా నమోదు అవుతున్నాయి.  

ఐదు రాష్ట్రాల ఎన్నికలు జరుగుతుండటంతో గృహ అవసరాలకు ఉపయోగించే సిలిండర్‌ ధరలు పెంచే సాహాసం చమురు కంపెనీలు చేయలేదు. దీంతో వీటి ధరల్లో ఎటువంటి మార్పులేదు. అయితే త్వరలోనే డొమెస్టిక్‌ సిలిండర్లకు ధరల వాత తప​‍్పదనే ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే ద్రవ్యోల్బణం ఎఫెక్ట్‌తో కొట్టుమిట్టాడుతున్న చిరు వ్యాపారులకు, స్ట్రీట్‌ఫుడ్‌ వెండర్స్‌కి కమర్షియల్‌ గ్యాస్‌ సిలిండర్‌ ధరల పెంపు అశనిపాతంగా మారింది. కోవిడ్‌ కారణంగా వచ్చిన నష్టాల భర్తీకి గతంలో కమర్షియల్‌ గ్యాస్‌ సిలిండర్‌ ధరలు పెంచారు. దీంతో తమ ఆదాయానికి గండి పడుతుందనే ఆవేదన చిరు వ్యాపారుల నుంచి వచ్చింది. ఇప్పుడు ఒకేసారి ఒక్కో సిలిండర్‌పై రూ. 105 వంతున ధరల పెంచాయి చమురు కంపెనీలు

మరిన్ని వార్తలు