బ్రాండ్‌ హైదరాబాద్‌.. వెనక్కి వెళ్లిన కంపెనీలు తిరిగి వస్తున్నాయ్‌!

28 Apr, 2022 15:58 IST|Sakshi

బెంగళూరుకు చెందిన ప్రముఖ రియాల్టీ సంస్థ ఎంబసీ తిరిగి హైదరాబాద్‌లో తమ కార్యకలాపాలు ప్రారంభిస్తున్నట్టు ప్రకటించింది. హైదరాబాద్‌లో వ్యాపారం ఆశించిన స్థాయిలో లేదంటూ 2019లో ఇక్కడ తమ వర్క్‌ ఆపేస్తున్నట్టు ఎంబసీ గ్రూపు ప్రకటించింది. కానీ మారిన పరిస్థితులు చెక్కుచెదరని హైదరాబాద్‌ బ్రాండ్‌ వ్యాల్యూని చూసి మరోసారి వస్తున్నట్టు తెలిపింది.

నగరానికి చెందిన ఎస్‌ఏఎస్‌ (సాస్‌) రియాల్టీ సంస్థతో కలిసి ఎంబసీ గ్రూపు హైదరాబాద్‌లో గ్రేడ్‌ ఏ ఆఫీస్‌ స్పేస్‌ ప్రాజెక్టులను చేపట్టనుంది. ఇప్పటికే మూడూ ప్రాజెక్టులు కొలిక్కి వచ్చాయి. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న మేజర్‌ టెక్‌ దిగ్గజ కంపెనీలు ఇండియాలో తమ వ్యాపార ప్రణాళికలకు హైదరాబాద్‌ను కేంద్రంగా చేసుకుంటున్నాయి. దీంతో ఈ డిమాండ్‌కు తగ్గట్టుగా ఆఫీస్‌ స్పేస్‌ను సప్లై చేస్తామంటోంది ఎంబసీ గ్రూపు.
ఎంబసీ గ్రూపు మూడు ప్రాజెక్టుల వివరాలు
- నానక్‌రామ్‌గూడా సాస్‌ ఆధ్వర్యంలో 36 అంతస్థుల భవనం నిర్మాణ పనులు జోరుగా సాగుతున్నాయి. ఇక్కడ 5.2 మిలియన్‌ చదరపు అడుగుల ఆఫీస్‌ స్పేస్‌ అందుబాటులోకి రానుంది.
- ఖాజాగూడా ఎంబసీ డైమండ్‌ టవర్‌ భవనానికి సంబంధించి మట్టి పనులు జరుగుతున్నాయి. ఇక్కడ 3 మిలియన్ల చదరపు అడుగుల ఆఫీస్‌ స్పేస్‌ అందుబాటులోకి రానుంది. ఈ రెండు ప్రాజెక్టులకు ఎంబీస గ్రూపు పార్టనర్‌గా వ్యవహరించనుంది
- క్రౌన్‌ పేరుతో 3 చదరపు మిలియన్ల ఆఫీస్‌ స్పేస్‌ భవనాన్ని నిర్మించనుంది. ఈ మూడు ప్రాజెక్టుల పనులు శరవేగంగా జరుగుతున్నాయి. 2023 మొదటి క్వార్టర్‌ కల్లా క్రమంగా మార్కెట్‌లోకి అందుబాటులోకి వస్తాయని ఎంబసీ గ్రూప్‌ తెలిపింది.
 

చదవండి: రియల్‌ ఎస్టేట్‌ డీల్స్‌.. ఏప్రిల్‌లో ఇదే రికార్డు..

మరిన్ని వార్తలు