ఎఫ్‌డీ కస్టమర్లకు ఎస్‌బీఐ గుడ్‌ న్యూస్‌! వడ్డీ రేట్లు పెంపు..

16 Feb, 2023 11:10 IST|Sakshi

దేశంలో అతిపెద్ద ప్రభుత్వ రంగ బాంక్‌ అయిన స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా(ఎస్‌బీఐ) తమ దగ్గర ఫిక్స్‌డ్‌ డిపాజిట్లు చేసే వారికి ఊరటనిచ్చింది. రూ.2 కోట్లలోపు ఎఫ్‌డీలపై వడ్డీ రేట్లను 5 నుంచి 25 బీపీఎస్‌ వరకు పెంచింది. అలాగే 400 రోజుల నిర్దిష్ట కాలవ్యవధితో కొత్త ఎఫ్‌డీ పథకాన్ని ప్రవేశపెట్టింది.

ఈ పథకానికి 7.10 శాతం వడ్డీ రేటును అందిస్తోంది. ఇది 2023 మార్చి 31 వరకు చెల్లుబాటులో ఉంటుంది. 7 రోజుల నుంచి 10 సంవత్సరాల కాలవ్యవధి గల ఎఫ్‌డీలపై 3 నుంచి 7 శాతం వరకు వడ్డీని చెల్లిస్తోంది. 2-3 సంవత్సరాల కాలానికి ఎఫ్‌డీ చేసిన సీనియర్‌ సిటిజన్లుకు 7.50 శాతం వడ్డీ లభిస్తుంది. సీనియర్‌ సిటిజన్లకు ఎస్‌బీఐ అందించే అత్యధిక వడ్డీ రేటు ఇదే. పెంచిన ఈ వడ్డీ రేట్లు ఫిబ్రవరి 15 నుంచి అమల్లోకి వచ్చాయి.

ఎస్‌బీఐ 2 నుంచి 3 సంవత్సరాల వ్యవధికి  చేసిన ఎఫ్‌డీలపై  వడ్డీ రేటును అత్యధికంగా 25 బీపీఎస్‌ పెంచింది. వీటిపై గతంలో 6.75 శాతం వడ్డీ వస్తుండగా ఇప్పుడు 7 శాతానికి పెరిగింది. అలాగే 3 నుంచి 10 ఏళ్ల వ్యవధి ఎఫ్‌డీలపైనా 25 బేసిస్‌ పాయింట్లు పెంచింది. వీటికి గతంలో 6.25 శాతం వడ్డీ ఇస్తుండగా తాజాగా 6.5 శాతం అందిస్తోంది. ఇక 1 నుంచి 2 సంవత్సరాల కాలానికి  చేసే ఎఫ్‌డీలపై అత్యల్పంగా కేవలం 5 బేసిస్‌ పాయింట్లు మాత్రమే వడ్డీ రేటు పెంచింది. వీటిపై 6.75 శాతం ఉన్న వడ్డీ రేటు ప్రస్తుతం 6.8 శాతానికి పెరిగింది.

అయితే సంవత్సరం కన్నా తక్కువ కాల వ్యవధి గల ఫిక్స్‌డ్‌ డిపాజిట్లపై ఎటువంటి పెంపూ లేదు. 211 రోజుల నుంచి సంవత్సరం లోపు చేసే ఎఫ్‌డీలపై 5.75 శాతం, 180 నుంచి 210 రోజుల లోపు వాటిపై 5.25 శాతం, 46 నుంచి 179 రోజుల వరకు చేసే ఎఫ్‌డీలపై 4.5 శాతం, 7 నుంచి 45 రోజులలోపు వాటిపై 3 శాతం వడ్డీ రేటును ఎస్‌బీఐ అలాగే కొనసాగిస్తోంది.

(ఇదీ చదవండి: సీనియర్‌ సిటిజన్స్‌ కోసం కొత్త పాలసీ.. ప్రయోజనాలు ఇవే..)

మరిన్ని వార్తలు