Dasara Special: దసరాకు బంగారం ధర దిగి వస్తుందా? కొనేద్దామా?

27 Sep, 2022 17:14 IST|Sakshi

పండగో, పబ్బమో వచ్చిందంటే కొత్త బట్టలతో పాటు  బంగారంపై మనసు మళ్లుతుంది భారతీయులకి. అందులోనూ దసరా, దీపావళి సీజన్‌ వచ్చిందంటే గోరంత బంగార​మైనా తమ ఇంటికి తెచ్చుకోవాలని ఆశపడతారు. ఈ పర్వదినాల్లో పసిడిని కొనడం అంటే సాక్షాత్తు ఆ శ్రీలక్ష్మీ  దేవిని ఇంటికి తీసుకొచ్చినంత సంబరం.  సాంప్రదాయం. అయితే సాధారణంగా బంగారం కొందామన్న ఆలోచన రాగాలనే అందరి మదిలో మెదిలే ప్రశ్న ఒక్కటే.... మనం కొన్నాక ఇంకా తగ్గుతుందేమో కదా..అవునా?మరి ఈ దసరాకి బంగారం ధరలు దిగి వస్తాయా? లేక అక్కడక్కడే కదలాడతాయా? ఓ సారి చూద్దాం!

సాక్షి, ముంబై:  దేశీయ మార్కెట్లలో బంగారం ధరలు  ఈ ఏడాది  మే నుండి  పెద్దగా హెచ్చు తగ్గులు లేకుండా కదలాడుతూ ఉన్నాయి.  10 గ్రాముల బంగారం ధర కనిష్టంగా  49,500, గరిష్టంగా రూ. 52,700  మధ్య పరిమితమైంది. అయితే ద్రవ్యోల్బణాన్ని అరికట్టేందుకు అమెరికా ఫెడరల్‌ రిజర్వ్‌ భారీ వడ్డింపు,  మన రూపాయి, దేశీయ స్టాక్‌ మార్కెట్లపై భారీ ప్రభావాన్నే చూపుతోంది.  

ఫెడ్‌ వడ్డింపు తరువాత ముఖ్యంగా డాలరు విలువ 20 ఏళ్ల గరిష్టాన్ని తాకింది.  డాలరు మారకంలో మన కరెన్సీరూపాయి 81.62 వద్ద ఆల్‌టైం కనిష్టాన్ని తాకింది. అటు  ఆసియా మార్కెట్లన్నీ బేర్‌ మంటున్నాయి. అలాగే డాలర్ ఇండెక్స్‌ బలం  పుత్తడిపై కూడా పదింది.  ఇది మరికొంత కాలం కొనసాగవచ్చనేది నిపుణుల అంచనా. అంతర్జాతీయ మార్కెట్లలో, ధరలు ఔన్సుకు 1680 డాలర్ల మార్క్ వద్ద గట్టి మద్దతు ఉందనీ, ఇది బ్రేక్‌ అయితే తప్ప బంగారం ధరలు దిగి వచ్చే ఛాన్సే లేదనది ఎనలిస్టుల మాట. కానీ ఆ స్థాయిలో గోల్డ్‌ ధరకు మద్దతు లభిస్తుందని అంతర్జాతీయ బలియన్‌ వర్తకులు అంటున్నారు.

పండుగ సీజన్‌: బంగారం కొందామా?
ఇప్పటికే  బంగారం ధరలు ఆల్‌ టైం గరిష్టం నుండి దాదాపు 10 శాతం దిగి వచ్చింది. దీనికి తోడు పెరుగుతున్న ద్రవ్యోల్బణం , గ్లోబల్‌గా పలు సెంట్రల్‌ బ్యాంకుల అధిక వడ్డీ రేట్ల మధ్య ప్రపంచ మాంద్య భయాలు పసిడి ధరకు ఊతమిచ్చేవేనని  చాలామంది ఎనలిస్టులు వాదన. ఇక దేశీయ మార్కెట్లలో, ధరలు 10 గ్రాముల రూ. 48,800 స్థాయివద్ద దగ్గర గట్టి మద్దతు ఉంటుంది. ఇది బ్రేక్‌ అయితే బంగారం ధరలో తీవ్రమైన ఒత్తిడి ఉంటుందని దేశీయ బులియన్‌  ట్రేడర్ల అంచనా. 

రాబోయే పండుగ కాలంలో ఫిజికల్ మార్కెట్‌లో బంగారం డిమాండ్ పెరుగుతుందని దుకాణ దారులు విశ్వాసం. దేశవ్యాప్తంగా పెళ్లిళ్ల సీజన్, వివిధ పండుగలు నగల డిమాండ్‌ను పెరుగుతుందని భావిస్తున్నారు. మరోవైపు ఆయిల్‌, బంగారం ప్రధాన దిగుమతిదారుగా ఇండియాలో బంగారం ధరలపై ఆయిల్‌ ధరల ప్రభావం కూడా ఉంటుంది.  పంట చేతికి వచ్చిన తర్వాత గ్రామీణ ప్రాంతాల్లో​పుంజుకునే డిమాండ్,  తక్కువ ధరల్లో పెట్టుబడి డిమాండ్‌ను పెంచుతుందని, గ్లోబల్‌ అ నిశ్చితుల నేపథ్యంలో బంగారం వైపు పెట్టుబడులు మళ్లే అవకాశం ఉందంటూ సానుకూల ధోరణిని కనబరుస్తున్నారు.  అలాగే, రాబోయే సీజనల్ డిమాండ్ పరిగణనలోకి తీసుకుని  బై ఆన్-డిప్స్ వ్యూహం  బెటర్‌ అని స్పష్టం చేస్తున్నారు.

మరిన్ని వార్తలు