షెల్‌ డీజిల్‌ లీటర్‌ 20 పెంపు

5 Oct, 2023 06:25 IST|Sakshi

లీటర్‌ విక్రయ ధర రూ.130

న్యూఢిల్లీ: షెల్‌ ఇండియా తన అవుట్‌లెట్ల ద్వారా విక్రయించే డీజిల్‌ ధరను లీటర్‌పై రూ.20 పెంచుతున్నట్టు ప్రకటించింది. వారం లోపే రెండో విడత ధరలను పెంచింది. దేశంలో అధిక వాటా కలిగిన ప్రభుత్వరంగ సంస్థలు మాత్రం ఎలాంటి మార్పుల్లేకుండా అవే రేట్లను కొనసాగిస్తున్నాయి. 2022 ఏప్రిల్‌ నుంచి ప్రభుత్వరంగ ఆయిల్‌ మార్కెటింగ్‌ కంపెనీలు విక్రయ ధరల్లో ఎలాంటి సవరణలు చేయకపోవడం గమనించొచ్చు.

అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు మే నెలలో 75 డాలర్లలోపు ఉంటే, ప్రస్తుతం 95 డాలర్లపైకి చేరుకోవడం తెలిసిందే. షెల్‌ ఇండియా గత వారం కూడా లీటర్‌ డీజిల్‌పై రూ.4 చొప్పున పెంచింది. ఈ సంస్థకు దేశవ్యాప్తంగా 346 పెట్రోల్‌ స్టేషన్లు ఉన్నాయి. ముంబైలో లీటర్‌ డీజిల్‌ను రూ.130కు, చెన్నైలో రూ.129 చొప్పున విక్రయిస్తోంది. పెట్రోల్‌ లీటర్‌ ధర రూ.117–118గా ఉంది. అదే ప్రభుత్వ రంగ ఆయిల్‌ కంపెనీలు లీటర్‌ డీజిల్‌ను రూ.95, లీటర్‌ పెట్రోల్‌ ధరను రూ.107 స్థాయిలో విక్రయిస్తుండడం గమనార్హం. ప్రాంతాలను బట్టి ఈ రేట్లలో స్వల్ప మార్పులు ఉంటాయి.

మరిన్ని వార్తలు