ఎలన్‌ మస్క్‌ కొత్త ప్లాన్‌.. ఈసారి అంతరిక్షంలో ఏకంగా..!

10 Aug, 2021 16:31 IST|Sakshi

మీకు ఒక వ్యాపారం ఉందనుకోండి. వ్యాపారం మరింత బాగా వృద్ధి చెందడం కోసం ఏ చేస్తారు..సింపుల్‌గా అడ్వర్‌టైజ్‌మెంట్ల ద్వారా ప్రజలకు మరింత దగ్గరయ్యేలా మీ వ్యాపారం గురించి తెలియజేస్తారు. ఒకప్పుడు అడ్వర్‌టైజ్‌మెంట్లను కరపత్రాల రూపంలో లేదా న్యూస్‌పేపర్లో యాడ్స్‌ రూపంలో ప్రచారం చేసేవారు. మారుతున్న కాలంతో పాటు మానవుడు సాంకేతికంగా ఎంతగానో అభివృద్ధి చెందాడు. నేటి డిజిటల్‌ కాలంలో సాంకేతికతను ఉపయోగించి అడ్వర్‌టైజ్‌మెంట్‌ రంగంలో కొత్త పుంతలు తొక్కుతూ..డిజిటల్‌ మార్కెటింగ్‌ ద్వారా పలు కంపెనీలు, వ్యాపార సంస్థలు  అడ్వర్‌టైజ్ చేస్తున్నాయి. 

తాజాగా ఎలన్‌ మస్క్‌కు చెందిన  స్పేస్‌ఎక్స్‌ కంపెనీ అడ్వర్‌టైజింగ్‌ రంగంలో కొత్త శకానికి నాంది పలకనుంది. ఏకంగా అంతరిక్షంలో అడ్వర్‌టైజ్‌ బిల్‌ బోర్డ్‌లను ఏర్పాటుచేయనుంది.  స్పేస్‌ఎక్స్‌ కంపెనీ కెనాడాకు చెందిన స్టార్టప్‌ జియోమెట్రిక్‌ ఎనర్జీ కార్పోరేషన్‌ (జీఈసీ)  భాగస్వామ్యంతో క్యూబ్‌శాట్‌ అనే ఉపగ్రహాన్ని అంతరిక్షంలోకి  ప్రయోగించనుంది. ఈ ఉపగ్రహంతో ఆయా కంపెనీలు లోగోల గురించి లేదా అడ్వర్‌టైజ్‌మెంట్‌లను అంతరిక్షంలో బిల్‌బోర్డ్స్‌పై కన్పించేలా చేయనుంది.

క్యూబ్‌శాట్‌ శాటిలైట్‌ చూపించే అడ్వర్‌టైజ్‌మెంట్లను యూట్యూబ్‌ ద్వారా ప్రత్యక్షప్రసారం చేయనున్నారు. అందుకోసం క్యూబ్‌సాట్‌కు సపరేటుగా సెల్ఫీ స్టిక్‌ను ఏర్పాటుచేసినట్లు తెలుస్తోంది. ఈ శాటిలైట్‌ను ఫాల్కన్‌-9 రాకెటును ఉపయోగించి త్వరలోనే స్పేస్‌ ఎక్స్‌ ప్రయోగించనుంది. ఈ సందర్భంగా  జీఈసీ స్టార్టప్‌ కంపెనీ సీఈవో శామ్యూల్ రీడ్  మాట్లాడుతూ..అంతరిక్షంలో అడ్వర్‌టైజ్‌మెంట్‌ చేసుకోవాలనే కంపెనీలు డాగీకాయిన్‌ క్రిప్టోకరెన్సీ ఉపయోగించి కూడా  ప్రచారం చేసుకోవచ్చునని తెలిపారు. క్యూబ్‌శాట్‌ ఉపగ్రహంతో అడ్వర్‌టైజింగ్‌ రంగంలో పెనుమార్పులు రానున్నట్లు ఆశాభావం వ్యక్తం చేశారు.

మరిన్ని వార్తలు