పరిమిత శ్రేణిలో ఒడిదుడుకుల ట్రేడింగ్‌

25 Mar, 2024 05:54 IST|Sakshi

హోలీ, గుడ్ ఫ్రైడే సందర్భంగా సోమ, శుక్రవారాలు ఎక్సే్చంజీలకు సెలవు

ఎఫ్‌అండ్‌ఓ ముగింపు నేపథ్యంలో అప్రమత్తతకు అవకాశం  

అంతర్జాతీయ పరిణామాలు, ఎఫ్‌ఐఐల పెట్టుబడులపై దృష్టి

ఈ వారం మార్కెట్‌పై స్టాక్‌ నిపుణుల అంచనాలు  

ముంబై: ట్రేడింగ్‌ మూడు రోజులే జరిగే ఈ వారంలో స్టాక్‌ మార్కెట్‌ పరిమిత శ్రేణిలో ట్రేడవుతూ తీవ్ర ఒడిదుడుకులకు లోనవుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ప్రయోగాత్మకంగా టి+0 సెటిల్‌మెంట్‌ అమలు, ఎఫ్‌అండ్‌ఓ డెరివేటివ్స్, ఆర్థి క సంవత్సరం గడువు ముగింపు అంశాలు ట్రేడింగ్‌ ప్రభావితం చేయచ్చని పేర్కొంటున్నారు.  అంతర్జాతీయ మార్కెట్‌ నుంచి ముఖ్యంగా అమెరికా జీడీపీ డేటాపై ఇన్వెస్టర్లు దృష్టి సారించవచ్చని అంచనా.

  వీటితో పాటు డాలర్‌ ఇండెక్స్, యూఎస్‌ బాండ్‌ ఈల్డ్స్, క్రూడాయిల్‌ ధరలు, రూపాయి విలువ తదితర అంశాలూ ట్రేడింగ్‌పై ప్రభావం చూపొచ్చంటున్నారు. హోలీ సందర్భంగా నేడు (సోమవారం), గుడ్ ఫ్రైడే సందర్భంగా శుక్రవారం ఎక్సే్చంజీలకు సెలవు కావడంతో ఈ వారం ట్రేడింగ్‌ మూడు రోజులు జరగుతుంది. అయితే ఈ రెండు సెలవు రోజుల్లో ఫారెక్స్, కమోడిటీ మార్కెట్లు సాయంత్రం ట్రేడింగ్‌లో యథావిధిగా పనిచేస్తాయి.
 
‘‘ఈ వారం ఆర్థిక సంవత్సరం (2023–24) ముగింపు కారణంగా ఇన్వెస్టర్లు, మ్యూచువల్‌ ఫండ్‌లు, దేశీయ సంస్థాగత సంస్థలు లాభాలు లేదా నష్టాలు స్వీకరించే అవకాశం ఉంటుంది. ట్రేడింగ్‌ మూడు రోజులే కావడంతో ఎక్సే్చంజీల్లో ట్రేడింగ్‌ పరిమాణం తక్కువగా ఉండొచ్చు. అయితే టి+0 సెంటిల్‌మెంట్‌ ప్రారంభం, ఎఫ్‌అండ్‌ఓ డెరివేటివ్స్‌ గడువు నేపథ్యంలో సూచీల ఊగిసలాట ఉండొచ్చు. లాభాలు కొనసాగితే నిఫ్టీ ఎగువ స్థాయిలో 22,200 స్థాయిని చేధించాల్సి ఉంటుంది. దిగువ స్థాయిలో 21,700 తక్షణ మద్దతు కలిగి ఉంది’’ అని మోతీలాల్‌ ఓస్వాల్‌ ఫైనాన్సియల్‌ సరీ్వసెస్‌ రీటైల్‌ రీసెర్చ్‌ హెడ్‌ సిద్దార్థ ఖేమా తెలిపారు.

గత వారం ప్రథమార్థంలో అమ్మకాలతో చతికిలపడిన స్టాక్‌ సూచీలు  ఫెడరల్‌ రిజర్వ్‌ సరళతర ద్రవ్య విధాన వైఖరి, సంస్థాగత ఇన్వెస్టర్ల బలమైన కొనుగోళ్లతో కారణంగా ద్వితీయార్థంలో బౌన్స్‌బ్యాక్‌ అయ్యాయి. వారం మొత్తంగా సెన్సెక్స్‌ 189 పాయింట్లు, నిఫ్టీ 74 పాయింట్లు చొప్పున లాభపడ్డాయి. ఐటీ, ఎఫ్‌ఎంసీజీ మినహా అన్ని రంగాల షేర్లు రాణించిన రికవరీకి తమ వంతు సాయం చేశాయి.

ప్రయోగాత్మకంగా టి+0 సెటిల్‌మెంట్‌ అమలు
మార్కెట్‌ నియంత్రణ సంస్థ సెబీ సూచనల మేరకు ట్రేడింగ్‌ జరిగిన రోజే సెటిల్‌మెంట్‌(టి+0) విధానాన్ని ఎక్సే్చంజీలు గురువారం(మార్చి 28) ప్రయోగాత్మకంగా ప్రవేశపెట్టనున్నాయి. అన్ని షేర్లకు టి+0 విధానం అమలు చేయడానికి ముందుగా 25 షేర్లు, పరిమిత బ్రోకర్లకు మాత్రమే మొదలుపెట్టనున్నారు. ప్రయోగ పనితీరు ఫలితాలను బట్టి టి+0 అమలు తేదీపై సెబీ ఒక నిర్ణయానికి వస్తుంది. తక్షణ సెటిల్‌మెంట్‌ వల్ల మార్కెట్లో ద్రవ్యలభ్యత పెరుగుతుంది. అలాగే భారత స్టాక్‌ మార్కెట్ల సామర్థ్యం, పారదర్శకత మెరుగవుతుంది.

గురువారం ఎఫ్‌అండ్‌ఓ ఎక్స్‌పైరీ
ఈ గురువారం(మార్చి 28న) నిఫ్టీ సూచీకి చెందిన ఫిబ్రవరి సిరీస్‌ డెరివేటివ్స్‌ కాంట్రాక్టులు ముగియనున్నాయి. అదేరోజున బ్యాంక్‌ నిఫ్టీ వీక్లీ ఎక్స్‌పైరీ తేదీ కూడా ఉంది. ట్రేడర్లు తమ పొజిషన్లపై తీసుకొనే స్క్వేయర్‌ ఆఫ్‌ లేదా రోలోవర్‌ నిర్ణయానికి అనుగుణంగా మార్కెట్‌ స్పందించవచ్చని నిపుణులు చెబుతున్నారు.

ప్రపంచ పరిణామాలు  
బ్యాంక్‌ ఆప్‌ జపాన్‌ ద్రవ్య పాలసీ సమావేశ వివ రాలు, అమెరికా గృహ అమ్మకాలు సోమవారం విడుదల కానున్నాయి. యూరోజోన్‌ ఆర్థిక, పారిశ్రామిక, సర్వీసెస్‌ సెంటిమెట్, వినియోగదారుల వి శ్వాస గణాంకాలు బుధవారం వెల్లడి కాను న్నాయి. బ్రిటన్‌ క్యూ4 జీడీపీ వృద్ధి, కరెంట్‌ ఖాతా, అమెరికా నాలుగో త్రైమాసిక జీడీపీ వృద్ధి డేటా గురువారం విడుదల అవుతుంది. చైనా కరెంట్‌ ఖాతా, జపాన్‌ నిరుద్యోగ రేటు, అమెరికా పీసీఈ ప్రైజ్‌ ఇండెక్స్‌ డేటా వివరాలు శుక్రవారం వెల్లడి అవుతాయి.  

విదేశీ ఇన్వెస్టర్ల బుల్లిష్‌ వైఖరి
భారతీయ ఈక్విటీ పట్ల విదేశీ ఇన్వెస్టర్లు బుల్లిష్‌ వైఖరి ప్రదర్శిస్తున్నారు. ఈ నెలలో ఇప్పటి వర కు (మార్చి 22 నాటికి) రూ. 38,000 కోట్లకు పైగా నిధులను దేశీయ ఈక్విటీల్లో పెట్టారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో సాను కూల పరిణామాలు, భారత ఆర్థిక వృద్ధి బలంగా ఉండటం వంటి అంశాలు ఎఫ్‌ఐఐలను ఆక ట్టుకుంటున్నాయి. ‘‘భారత జీడీపీ వృద్ధి, ఆర్‌బీ ఐ అంచనాలు, వచ్చే ఆర్థిక సంవత్సరం చివర్లో కీలక వడ్డీ రేట్లు 20–50 బేసిస్‌ పాయింట్ల మేర తగ్గవచ్చనే నిపుణుల అంచనాలతో విదేశీ ఇన్వెస్టర్లు భారత ఈక్విటీలను కొనేందుకు ఆసక్తి చూపుతున్నారు’’ అని మారి్నంగ్‌స్టార్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ రీసెర్చ్‌ ఇండియా మేనేజర్‌ రీసెర్చ్‌ అసోసియేట్‌ డైరెక్టర్‌ హిమాన్షు శ్రీవాస్తవ పేర్కొన్నారు. కాగా అంతకుముందు జనవరిలో రూ. 25,743 కోట్ల భారీ పెట్టుబడుల తర్వాత గత నెల ఫిబ్రవరిలో రూ. 1,539 కోట్ల షేర్లను విక్ర యించారు.  ఈ ఏడాదిలో ఇప్పటివర కు ఎఫ్‌పీఐలు రూ. 13,893 కోట్లు ఈక్విటీల్లోకి, రూ. 55,480 కోట్లను డెట్‌ మార్కెట్లో ఇన్వెస్ట్‌ చేశారు.

Election 2024

మరిన్ని వార్తలు