ఇజ్రాయెల్‌పై ప్రతిదాడి.. అమెరికాకు ఇరాన్‌ హెచ్చరిక | Sakshi
Sakshi News home page

ఇజ్రాయెల్‌పై ప్రతిదాడి.. అమెరికాకు ఇరాన్‌ హెచ్చరిక

Published Sat, Apr 6 2024 10:41 AM

Iran Tells US To Step Aside As It Prepares To Attack Israel - Sakshi

ఇజ్రాయిల్‌, ఇరాన్‌ మద్య మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. గతేడాది అక్టోబర్ 7న ఇజ్రాయిల్‌పై హమాస్ దాడి తర్వాత ఇరు దేశాల మధ్య సంబంధాలు దిగజారిపోయాయి. దీనికి తోడు ఇటీవల సిరియాలోని ఇరాన్‌ రాయబార కార్యాలయంపై ఇజ్రాయిల్ వైమానిక దాడి చేయడంతో ఇంకా ప్రమాదకరంగా మారాయి. 

ఇజ్రాయెల్‌పై ప్రతి దాడికి సిద్ధమవుతున్న తరుణంలో ఇరాన్‌ అమెరికాకు ఓ వార్నింగ్‌ ఇచ్చింది. తాము ఇజ్రాయిల్‌పై యుద్ధానికి దిగబోతున్నామని.. ఇందుకు యూస్‌ దూరంగా ఉండాలని హెచ్చరికలు జారీచేసింది. ఇజ్రాయిల్‌ ప్రధాని నెతన్యాహు ఉచ్చులో యూఎస్‌ చిక్కుకోవద్దని సూచించింది. ఈ మేరకు లిఖితపూర్వకంగా సందేశం పంపింది.

యుద్ధం నుంచి యూఎస్‌ పక్కకు తప్పుకోవాలని.. అప్పుడే మీరు(అమెరికా) సురక్షితంగా ఉండగలరని తెలిపింది. కాగా ఇందుకు అమెరికా స్పందిచినట్లు.. తమ పౌరులను లక్ష్యంగా చేసుకొని దాడులు చేయరాదని కోరినట్లు ఇరాన్ అధ్యక్షుడి రాజకీయ వ్యవహారాల అధఙకారి మొహమ్మద్ జంషిది తెలిపారు. అయితే యూఎస్‌ ఇప్పటి వరకు అధికారికంగా మాత్రం  స్పందించలేదు.

కాగా సిరియా రాజధానిలోని ఇరాన్ దౌత్య కార్యాలయంపై ఇటీవలవైమానిక దాడి జరిగిన విషయం తెలిసిందే. అయితే ఈ దాడులు చేసింది ఇజ్రాయిలే అంటూ ఇరాన్‌ ఆరోపిస్తుంది.  ఈ ఘటనలో ఇరాన్ సైన్యానికి చెందిన ఇద్దరు మిలిటరీ కమాండర్లతోపాటు పాటు 13 మంది మరణించారు. మరోవైపు ఈ దాడికి తప్పకుండా ప్రతీకారం తీర్చుకుంటామని ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ చెప్పారు. ఇరాన్‌ దాడులకు దిగుతుందనే భయంతో ఇజ్రాయిల్‌ అప్రమత్తమైంది. జీపీఎస్‌ నావిగేషన్‌ను నిలిపివేసింది. తమ సైనికులకు ఇచ్చిన సెలవులను రద్దు చేసింది. రక్షణ సామర్ధ్యాన్ని విస్తరించింది. తన సరిహద్దులన్నింటిలో బలగాలను మోహరించింది. ముందు జాగ్రత్తగా అన్నిచోట్ల  బాంబు షెల్టర్‌లను తెరిచింది.

Advertisement
Advertisement