సాక్షి మనీ మంత్ర: నిఫ్టీ@21,100.. లాభాల్లో ప్రారంభమైన సూచీలు

14 Dec, 2023 10:00 IST|Sakshi

దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు గురువారం భారీ లాభాల్లో ట్రేడింగ్‌ను మొదలుపెట్టాయి. ప్రారంభంలో సెన్సెక్స్‌ 665 పాయింట్ల లాభంతో 70,249 వద్ద, నిఫ్టీ 186 పాయింట్లు ఎగసి 21,112 వద్ద ట్రేడవుతున్నాయి. 

పీటీసీ ఇండస్ట్రీస్‌, పైసాలో డిజిటల్‌, టాన్లా ప్లాట్‌ఫామ్స్‌, అదానీ గ్రీన్‌ ఎనర్జీ, ఎన్‌బీసీసీ (ఇండియా) షేర్లు భారీ లాభాల్లో ఉండగా.. ఛంబల్‌ ఫర్టిలైజర్స్‌, హిండ్‌ జింక్‌, మిస్‌ బెక్టార్స్‌ ఫుడ్‌, అరవింద్‌ లిమిటెడ్‌, ధాని సర్వీసెస్‌ షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. డాలర్‌తో పోలిస్తే రూపాయ మారకం విలువ 83.38 వద్ద కొనసాగుతోంది. అమెరికా ఫెడ్‌ నిర్ణయం అంతర్జాతీయ మార్కెట్‌ సూచీలపై సానుకూల ప్రభావం చూపింది. ఆసియా-పసిఫిక్‌లో ఒక్క జపాన్‌ సూచీ మినహా మిగిలిన ప్రధాన సూచీలు మొత్తం లాభాల్లోనే ట్రేడవుతున్నాయి.

అమెరికా ఫెడరల్‌ రిజర్వ్‌ కీలక వడ్డీ రేట్లలో ఎలాంటి మార్పు చేయలేదు. రెండు రోజుల పాటు జరిగిన ఫెడరల్‌ ఓపెన్‌ మార్కెట్‌ కమిటీ (ఎఫ్‌ఓఎమ్‌సీ) సమావేశ నిర్ణయాన్ని అర్ధరాత్రి దాటాక వెలువరిచింది. ద్రవ్యోల్బణం ఇంకా 2 శాతం లక్ష్యం కంటే ఎగువనే ఉన్నందున, కఠిన వైఖరిని కొనసాగిస్తూ.. విధాన రేట్లను ప్రస్తుత 5.25-5.50 శాతం శ్రేణిలోనే ఉంచుతున్నట్లు పేర్కొంది. వరుసగా మూడో సారీ రేట్లను ఇదే స్థాయిలో కొనసాగించింది. ఇవి 22 ఏళ్ల గరిష్ఠ స్థాయి రేట్లు 2024లో 2 సార్లు రేట్ల కోతకు అవకాశం ఉండొచ్చనే సంకేతాలిచ్చింది.

ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో (2023-24) మన ఆర్థిక వ్యవస్థ 6.7 శాతం వృద్ధి రేటును నమోదు చేసే అవకాశం ఉందని ఏషియా డెవలప్‌మెంట్‌ బ్యాంక్‌ (ఏడీబీ) అంచనా వేసింది. సెప్టెంబరులో అంచనా వేసిన 6.3 శాతంతో పోలిస్తే పెరిగింది.

(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు)

>
మరిన్ని వార్తలు