తెలుగు రాష్ట్రాలపై ప్రత్యేక దృష్టి 

9 Dec, 2021 05:13 IST|Sakshi

కొత్తగా 9 శాఖల ఏర్పాటు;

భారీగా ఏజెంట్ల నియామకం 

త్వరలో రూ. 488 కోట్ల సమీకరణ 

టాటా ఏఐఏ లైఫ్‌ ఇన్సూరెన్స్‌ ఎండీ నవీన్‌ తహ్లియాని వెల్లడి 

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: ప్రైవేట్‌ రంగ జీవిత బీమా దిగ్గజం టాటా ఏఐఏ లైఫ్‌ ఇన్సూరెన్స్‌ .. తెలుగు రాష్ట్రాల్లో విస్తరణపై మరింతగా దృష్టి పెడుతోంది. ఇందులో భాగంగా గత మూడు నెలల వ్యవధిలో 9 శాఖలు ఏర్పాటు చేసింది. గత ఆర్థిక సంవత్సరం 2,000 మంది పైచిలుకు అడ్వైజర్లను నియమించుకుంది. ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటిదాకా సుమారు 1,400 మంది చేరారు.

దీంతో తెలుగు రాష్ట్రాల్లో టాటా ఏఐఏ లైఫ్‌ శాఖల సంఖ్య 22కి చేరగా, అడ్వైజర్ల సంఖ్య 4,400 పైచిలుకు పెరిగింది. కంపెనీ ఎండీ, సీఈవో నవీన్‌ తహ్లియానీ మీడియా సమావేశంలో ఈ విషయాలు తెలిపారు. దేశవ్యాప్తంగా ప్రస్తుతం తమకు సుమారు 314 శాఖలు ఉండగా.. ఆంధ్రప్రదేశ్‌లో 12, తెలంగాణలో 10 ఉన్నాయని చెప్పారు.

ఏజెన్సీల ద్వారా వచ్చే కొత్త ప్రీమియం వసూళ్లకు సంబంధించి గత ఆర్థిక సంవత్సరం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల వాటా 8%గా నమోదైందని, అన్ని మాధ్యమాల ద్వారా వచ్చిన కొత్త ప్రీమియం వ్యాపారంలో ఇది 5.5%గా ఉందని ఆయన తెలిపారు. ప్రస్తుతం తమ సంస్థ నిర్వహణలోని ఆస్తులు(ఏయూఎం) రూ.54,000 కోట్లుగా ఉంటాయన్నారు.

30–40 శాతం వృద్ధి అంచనా.. 
గత ఆర్థిక సంవత్సరంలో మొత్తం ప్రీమియం ఆదాయం సుమారు 30% పెరిగి రూ. 11,105 కోట్లకు చేరిందని నవీన్‌ చెప్పారు. తమ కంపెనీపరంగా ఈ ఆర్థిక సంవత్సరం కూడా 30–40% వృద్ధి అంచనా వేస్తున్నామని, పరిశ్రమ సగటు 20% స్థాయిలో ఉండవచ్చన్నారు. సుమారు రూ. 488 కోట్లు సమీకరించేందుకు నియంత్రణ సంస్థ ఐఆర్‌డీఏఐ నుంచి అనుమతి లభించిందని, త్వరలో ఈ నిధులను సమీకరించనున్నామని నవీన్‌ పేర్కొన్నారు.

కోవిడ్‌ క్లెయిమ్‌లు పెరుగుతున్న నేపథ్యంలో రీఇన్సూరెన్స్‌ సంస్థలు కూడా రేట్లు పెంచే యోచనలో ఉన్నాయని ఆయన తెలిపారు. దీనివల్ల పాలసీదారులపై భారం పడకుండా ఉండేలా చూసేందుకు వాటితో చర్చలు జరుపుతున్నామని చెప్పారు.  

మరిన్ని వార్తలు