కొత్త స్కాం వెలుగులోకి: సొమ్ము గోవిందా! లబోదిబోమంటున్న నగల వ్యాపారులు

30 Aug, 2023 20:51 IST|Sakshi

 సైబర్‌ నేరం కాదు, అంతకుమించిన స్కాం

 మీ అకౌంట్‌ క్రెడిట్‌ అంటూ ఫేక్‌ మెసేజ్‌, లక్షల విలువైన నగలు ఖరీదు

బాధితుల్లో చాలామంది నగల వ్యాపారులు

‘మీ అకౌంట్లో డబ్బు పడింది’ అంటూ జ్యూయల్లరీ వ్యాపారులను దోచేసిన వైనం తాజాగా వెలుగులోకి వచ్చింది. ఇలా ఒక్కరు ఇద్దరుకాదు చాలామంది నగల వ్యాపారులు ఇలాంటి మోసానికి బలైనట్టు తెలుస్తోంది.

 ఎన్‌డీటీవీ అందించిన కథనంలోని వి వరాలను పరిశీలస్తే నగలవ్యాపారి నావల్ కిషోర్ ఖండేల్వాల్ ఢిల్లీలో అతిపెద్ద బంగారం, వెండి మార్కెట్‌లో ఐదు దశాబ్దాల నాటి దుకాణాన్ని నడుపుతున్నారు. గత వారం అయోధ్యకు వెళ్లారు. అక్కడ ఉండగానే ఒక వ్యక్తి ఫోన్‌లో సంప్రదించి, 15 గ్రాముల బంగారు గొలుసు కొనుగోలుకు  కొడుకులతో డీల్‌  కుదుర్చుకున్నానని చెప్పాడు. తాను దుకాణాన్ని సందర్శించ లేనని  ఆన్‌లైన్‌లోనే డబ్బులు  చెల్లిస్తానంటూ  ఖండేల్వాల్‌ని నమ్మించాడు. ఇంటర్నెట్-బ్యాంకింగ్ వివరాలు అడిగి తెలుసుకున్నాడు.  

వెంటనే తన బ్యాంక్ ఖాతాలో  రూ. 93,400 జమ అయినట్లు మెసేజ్ వచ్చింది. దీంతో అతను తన కుమారులకు స్క్రీన్‌షాట్ పంపాడు. దీంతో  పేమెంట్‌ అయినట్టుగా భావించిన వారు  ఆ వ్యక్తి ఇచ్చిన చిరునామాకు బంగారు గొలుసును పంపించారు.  ఇదే ప్లాన్‌ను   పక్కగా మరోసారి అమలు చేశారు  కేటుగాళ్లు.

దీంతో మరుసటి రోజు అదే వ్యక్తి ఫోన్ చేసి తనకు 30 గ్రాముల బంగారు గొలుసు కావాలని చెప్పాడు.  సేమ్‌ సీన్‌ రిపీట్‌ అయింది.   ఖండేల్‌వాల్‌కి రూ.1,95,400 తన ఖాతాలో జమ చేసినట్లు  ఎస్‌ఎంఎస్‌ రావడం, ఆ గోల్డ్‌ చెయిన్‌ను అతనికి పంపడం జరిగిపోయింది.  ఆ తరువాత తీరిగ్గా నగల వ్యాపారి బ్యాంక్ మొబైల్ యాప్‌లో  అకౌంట్‌ చెక్‌ చేసుకొని డబ్బు జమ కాలేదని గ్రహించాడు.  అపుడు తనకు వచ్చిన మెసేజ్‌  అచ్చం బ్యాంకు ఫార్మాట్‌లో  ఉన్న ఫేక్‌ మేసేజ్‌ అని తెలుసుకుని లబోదిబోమన్నాడు. మరోవైపు ఇందులో తమ బాధ్యత ఏమీ లేదని, తామేం చేయలేమని బ్యాంకు అధికారులు తెలిపారు. ఫిర్యాదు నమోదు చేసుకున్న పోలీసులు ఇప్పటివరకు నేరగాళ్లు ఎవరు అనేది  కనుగొనలేక పోయారు

ఇక్కడ ఇంకో ట్విస్ట్‌ ఏంటంటే ఇతనితో పాటు దేశంలో పలు చోట్ల పలువురు వ్యాపారులు కూడా ఇలాంటి మోసానికి బలైయ్యారనేది  తమ దృష్టికి వచ్చిందని బులియన్ అండ్ జ్యువెలర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ యోగేష్ సింఘాల్  తెలిపారు.  అయితే బ్యాంక్ పోర్టల్ లేదా ఏదైనా వెబ్ పోర్టల్ ఉపయోగించలేదు కాబట్టి ఈ మోసం సైబర్ చట్టం కిందకు రాదని ఇది మోసం, ఫోర్జరీకి సంబంధించిన విషయం కాబట్టి క్రిమినల్‌ యాక్ట్‌ కిందికి వస్తుందని సైబర్ లా నిపుణుడు సజల్ ధమిజా అన్నారు.

మరిన్ని వార్తలు