చిత్తూరు అర్బన్: ఓటు హక్కు పొందడం పౌరుల బాధ్యతని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి ఐ.కరుణ కుమార్ స్పష్టం చేశారు. ఓటు నమోదు కోసం ఆయన శనివారం దరఖాస్తు చేసుకున్నారు. చిత్తూరు నియోజకవర్గ ఈఆర్ఓ, ఆర్డీఓ చిన్నయ్య, ఏఈఆర్ఓ, కమిషనర్ జె.అరుణకు ఆయన పూర్తి చేసిన ఫారం–6 అందించారు. న్యాయమూర్తి మాట్లాడుతూ ఓటు హక్కు నమోదు, ఓటు వినియోగంపై ప్రజల్లో విస్తృతంగా అవగాహన కల్పించాలన్నారు. అర్హులైన వారు తప్పనిసరిగా ఓటరుగా నమోదు చేసుకునేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ ఓటు నమోదుపై ప్రత్యేక కార్యక్రమం చేపడుతున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో సీఎంఎం గోపీ పాల్గొన్నారు.
తిరుచ్చిపై ప్రసన్నుడి చిద్విలాసం
పుత్తూరు: మండలంలోని అప్పలాయిగుంటలో వెలసిన శ్రీప్రసన్న వేంకటేశ్వరస్వామివారు శనివారం తిరుచ్చిపై కొలువు దీరి పురవీధుల్లో విహరించారు. ఈ సందర్భంగా వేకువనే శ్రీవారిని సుప్రభాత సేవతో మేల్కొలిపి నిత్య కై ంకర్యాలు సమర్పించారు. సాయంత్రం పట్టు పీతాంబరాలు, స్వర్ణాభరణాలు, సుగంధ పరిమళభరిత పుష్పమాలికలతో శ్రీదేవి, భూదేవి సమేత వేంకటేశ్వరస్వామిని సుందరంగా అలంకరించి ఊయలలో కొలువు దీర్చారు. భక్తి కీర్తనల నడుమ కనులపండువగా ఊంజల్ సేవ జరిపించారు. అనంతరం సర్వాలంకార భూషితుడైన శ్రీవారు ఉభయ దేవేరులతో కలిసి తిరుచ్చి వాహనంపై ఊరేగారు.
వాక్ ఇన్ ఇంటర్వ్యూ
తిరుపతి తుడా : స్విమ్స్ శ్రీ బాలాజీ ఇన్సిట్యూట్ ఆఫ్ ఆంకాలజీ ఆస్పత్రిలో పలు పోస్టులకు వాక్ ఇన్ ఇంటర్వ్యూను నిర్వహించనున్నట్లు రిజిస్ట్రార్ అపర్ణ బిట్ల తెలిపారు. వివిధ కేటగిరీ కాంట్రాక్ట్ పోస్టులకు ఇంటర్వ్యూలు ఉంటాయన్నారు. అందులో మెడికల్ ఆఫీసర్స్, అసిస్టెంట్ ప్రొఫెసర్లకు 22న, స్టాఫ్ నర్సులు, ఏఎన్ఎమ్లకు 23న, పారామెడికల్, పీఆర్ఓ, ఎంఎస్డబ్ల్యూ పోస్టులకు 27న, డేటా ఎంట్రీ ఆపరేటర్, ఎలక్ట్రిషియన్, డ్రైవర్ పోస్టులకు 28 వ తేదీన ఇంటర్వ్యూలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. వివరాలకు స్విమ్స్ వెబ్సైట్ సందర్శించాలని సూచించారు.