శంషాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌లో హైఅలర్ట్‌.. బాంబు బెదిరింపు మెయిల్‌, ఆ వెంటనే ‘సారీ’ అంటూ మరో మెయిల్‌

29 Aug, 2023 08:00 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: శంషాబాద్‌ రాజీవ్‌ గాంధీ ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్ట్‌లో హైఅలర్ట్‌ నెలకొంది. బాంబు బెదిరింపు మెయిల్‌తో అధికారులు అప్రమత్తం అయ్యారు. దీంతో అప్రమత్తమైన సీఐఎస్‌ఎఫ్‌, బాంబు స్క్వాడ్‌ టీం తనిఖీలు చేపట్టాయి. అయితే కాసేపటికే ఈ వ్యవహారంలో మరో ట్విస్ట్‌ వెలుగు చూసింది.

శంషాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌ను ఇవాళ రాత్రి ఏడుగంటలకు పేల్చేస్తామంటూ ఎయిర్‌పోర్ట్‌ కస్టమర్‌ కేర్‌ సెంటర్‌కు ఓ మెయిల్‌ వచ్చింది. దీంతో సిబ్బంది ఉరుకులు, పరుగులు పెట్టాల్సి వచ్చింది. అయితే కాసేపటికే అదే మెయిల్‌ ఐడీ నుంచి మరో మెయిల్‌ వచ్చింది. 

తమ కుమారుడి మానసిక స్థితి బాగోలేదని.. అందుకే అలా సందేశం పంపాడని.. క్షమించాలని ఆ మెయిల్‌లో ఉంది. దీంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. అయితే ఎందుకైనా మంచిదనే ఉద్దేశంతో తనిఖీలు మాత్రం కొనసాగించి.. ఆ బెదిరింపును ఫేక్‌గా నిర్ధారించుకున్నాయి. మరోవైపు ఆ మెయిల్స్‌ బెంగాల్‌ నుంచి వచ్చినట్లు తెలుస్తోంది.  ఆ మెయిల్స్‌ పంపిన చిరునామాను ట్రేస్‌ చేసే పనిలో అధికారులు ఉన్నారు. 
 

మరిన్ని వార్తలు