స్కూల్‌ బస్సుకింద పడి బాలుడి మృతి

22 Apr, 2023 09:23 IST|Sakshi

కళ్యాణదుర్గం: స్కూల్‌ బస్సు దూసుకెళ్లడతో ఓ బాలుడు మృతి చెందాడు. స్థానికుల వివరాలమేరకు..  మండలంలోని చాపిరి గ్రామానికి చెందిన మధు, వాణీ దంపతులకు ఒక్కగానొక్క సంతానం అయిన విçహాన్‌ (5) కళ్యాణదుర్గం జ్ఞానభారతి పాఠశాలలో 1వ తరగతి చదువుతున్నాడు. శుక్రవారం మధ్యాహ్నం విహాన్‌ పాఠశాల నుంచి బస్సులో చాపిరి గ్రామానికి వచ్చాడు. బస్సుదిగి ఇంటికి వెళ్తుండగా ప్రమాదవశాత్తూ బస్సు వెనుక చక్రాల కింద పడ్డాడు.  స్కూల్‌ బస్సు డ్రైవర్‌ గమనించకుండా ముందుకు వెళ్లడంతో  ఈ ప్రమాదం చోటుచేసుకుంది.

ఈ ఘటనలో విహాన్‌ బస్సు టైరు కింద పడి మృతి చెందాడు. గమనించిన గ్రామస్తులు స్కూల్‌ బస్సు డ్రైవర్‌ను అదుపులోకి తీసుకుని పోలీసులకు సమాచారం అందించారు. కళ్యాణదుర్గం రూరల్‌ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. అల్లారు ముద్దుగా పెంచుకున్న ఒక్కగానొక్క కొడుకు మృతి చెందిన విషయం తెలుసుకున్న తల్లితండ్రులు, బంధువులు కన్నీరు మున్నీరు గా విలపించారు. చిన్నారి మృతి చెందడంతో గ్రామంలో విషాదచాయలు అలముకున్నాయి. 

మరిన్ని వార్తలు