పాపం ఏమైందో గానీ పెళ్లయిన నెలకే జవాను, భార్య ఆత్మహత్య

7 Feb, 2022 03:43 IST|Sakshi
పొదిలి మహానంది, భార్య ప్రియాంక (ఫైల్‌)

పెళ్లయిన నెలకే భార్య ఆత్మహత్య.. 

ఆ విషయం తెలిసి జవాను బలవన్మరణం

మద్దిపాడు: పెళ్లయిన 38 రోజులకే భార్య ఆత్మహత్య చేసుకుంది.. విషయం తెలుసుకున్న ఆర్మీ జవాను అయిన భర్త ఢిల్లీ నుంచి వచ్చి మరీ రిజర్వాయర్‌లో దూకి బలవన్మరణానికి పాల్పడిన విషాద ఘటన ప్రకాశం జిల్లాలో ఆదివారం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. కొరిశపాడు మండలం మేదరమెట్ల గ్రామానికి చెందిన పొదిలి మహానంది (30)కి ఒంగోలు సమీపంలోని ముక్తినూతలపాడు గ్రామానికి చెందిన తురకపల్లి ప్రియాంకతో గత డిసెంబర్‌ 29న వివాహమైంది. సంక్రాంతి పండుగ తరువాత తాను పనిచేస్తున్న సీఐఎస్‌ఎఫ్‌ క్యాంప్‌కు చేరుకున్నాడు.

శుక్రవారం రాత్రి ప్రియాంక ఉరేసుకుని చనిపోయిందని సమాచారం రావడంతో హుటాహుటిన ఢిల్లీ నుంచి విమానంలో హైదరాబాద్‌ చేరుకుని అక్కడి నుంచి రైలులో ఒంగోలు వచ్చాడు. ఒంగోలు నుంచి ఆటోలో మల్లవరం వద్ద ఉన్న గుండ్లకమ్మ రిజర్వాయర్‌ వద్దకు చేరుకుని అక్కడ ఉన్న వేంకటేశ్వరస్వామి ఆలయం వద్ద బ్యాగ్, ఇతర లగేజ్‌ ఉంచి, రిజర్వాయర్‌ 14వ గేటు వద్ద తన దుస్తులు, చెప్పులు, సెల్‌ఫోన్, పర్స్‌ వదిలేసి రిజర్వాయర్‌లోకి దూకేశాడు.

అంతకు ముందు 4 గంటల సమయంలో ఇంటికి ఫోన్‌ చేసి తాను చనిపోవడానికి రిజర్వాయర్‌ వద్దకు వచ్చినట్లు తెలపడంతో బంధువులు వెంటనే బయలుదేరి రిజర్వాయర్‌ వద్దకు వచ్చి పరిశీలించగా ఫోన్, దుస్తులు కనిపించడంతో మద్దిపాడు ఎస్‌ఐ శ్రీరామ్‌కు సమాచారం అందించారు. గజఈతగాళ్లు, ఫైర్‌ సిబ్బంది సాయంతో గాలించగా సాయంత్రం 5 గంటల సమయంలో మృతదేహం బయటపడింది. మహానంది తల్లిదండ్రులు, బంధువులు రిజర్వాయర్‌ వద్దకు వచ్చి మృతదేహాన్ని చూసి విలపించారు. ఎస్‌ఐ కేసు నమోదు చేసుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఒంగోలు రిమ్స్‌కు తరలించారు.  

మరిన్ని వార్తలు