మంగినపూడి బీచ్‌లో రాసలీలలు, 8 జంటలు అరెస్టు

5 Aug, 2021 08:40 IST|Sakshi

మంగినపూడి బీచ్‌ రిసార్ట్‌పై దాడి

ఎనిమిది జంటలను అదుపులోకి తీసుకున్న పోలీసులు 

కోనేరు సెంటర్‌: పర్యాటకులకు ఆహ్లాదాన్ని పంచాల్సిన మంగినపూడి బీచ్‌ వ్యభిచారానికి కేరాఫ్‌ అడ్రస్‌గా మారింది. మచిలీపట్నంతో పాటు జిల్లాలోని ఇతర ప్రాంతాల నుంచి యువతీయువకులు నిత్యం బీచ్‌ సందర్శనకు వచ్చి తమ రాసలీలలు సాగిస్తున్నారు. స్థానికంగా ఉన్న రిసార్ట్‌లు ఉపయోగపడుతుండటంతో యువతీ, యువకులతో పాటు వివాహేతేర సంబంధాలు నెరపే జంటలు, అచ్చంగా వ్యభిచారం చేసే మహిళలు నిత్యం పదుల సంఖ్యలో రిసార్ట్‌లకు చేరుతున్నారు.

బందరు రూరల్‌ పోలీసులు బుధవారం రిసార్ట్‌పై చేసిన దాడిలో అనేక జంటలు పోలీసులకు చిక్కాయి. రిసార్ట్‌ నడిపే వ్యక్తి మచిలీపట్నంతో పాటు ఇతర ప్రాంతాల నుంచి వచ్చే పర్యాటకులకు రూంలను గంటల లెక్కన అద్దెకు ఇస్తూ సొమ్ము చేసుకుంటున్నట్లు పోలీసుల విచారణలో తేలింది. గంటకు రూ. 1000 చొప్పున వసూలు చేస్తూ ఈ విధమైన నిర్వాకానికి పూనుకుంటున్నట్లు చెబుతున్నారు.

కచ్చితమైన సమాచారంతో... 
రిసార్ట్‌లో నిర్వాకంపై కచ్చితమైన సమాచారంతోనే బందరు రూరల్‌ ఎస్సై కె వై దాస్‌ సిబ్బందితో కలిసి మెరుపుదాడి చేశారు. పోలీసులు రిసార్ట్‌పై దాడి చేసిన విషయాన్ని గమనించిన కొన్ని జంటలు తోటల్లోకి పరుగులు తీయగా మరి కొందరు రూంలలోని బాత్‌రూమ్‌లలోకి వెళ్లి దాక్కున్నట్లు తెలిసింది. రూమ్‌లలో కొన్ని కుటుంబాలు సైతం ఉండటంతో విషయం అర్థమైన పోలీసులు వారిని ఎలాంటి ఇబ్బంది పెట్టకుండా వివరాలు సేకరించి పంపించారు. అనుమానాస్పదంగా చిక్కిన ఎనిమిది జంటలను పోలీసు జీపులో బందరు రూరల్‌ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. పోలీసులకు చిక్కిన వారిలో కొంత మంది ప్రముఖులు, మరి కొందరు ప్రజాప్రతినిధుల వద్ద పనిచేస్తున్న వారు ఉన్నట్లు విశ్వసనీయ సమాచారం.

మరిన్ని వార్తలు