ప్రజాభవన్‌ ఘటన.. కారు డ్రైవ్‌ చేసింది మాజీ ఎమ్మెల్యే షకీల్‌ కొడుకే: డీసీపీ విజయ్‌

26 Dec, 2023 11:03 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ర్యాష్‌ డ్రైవింగ్‌తో ప్రజా భవన్‌ వద్ద బారికేడ్లను ఢీ కొట్టిన కేసులో బోధన్‌ మాజీ ఎమ్మెల్యే షకీల్‌ కొడుకు రహిల్‌ పేరును కూడా చేర్చినట్లు  వెస్ట్ జోన్ డీసీపీ విజయ్ కుమార్ తెలిపారు. కేసులో మాజీ ప్రజాప్రతినిధి తనయుడ్ని తప్పించారని ప్రచారం నడుస్తున్న నేపథ్యంలో.. డీసీపీ సాక్షి ద్వారా స్పందించారు. 

‘‘ప్రజా భవన్ వద్ద న్యూ ఇయర్ కోసం ఏర్పాటు చేసినటువంటి బ్యారికేట్స్ ను అతివేగంగా వచ్చి ఓ బీఎండబ్ల్యూ కారు ఢీ కొట్టింది. కారులో ఇద్దరు యువకులతో పాటు ఇద్దరు యువతులు ఉన్నారు. వీళ్లంతా స్టూడెంట్స్. కారు డ్రైవ్ చేసింది బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ కొడుకు రహిల్. ప్రస్తుతం అతను పరారీలో ఉన్నాడు. మిగతా వారిని అదుపులోకి తీసుకున్నాం’’ అని డీసీపీ విజయ్‌కుమార్‌ సాక్షికి తెలిపారు. 


ఆపై షకీల్‌ ఇంట్లో డ్రైవర్‌గా పని వేసే వ్యక్తి.. తానే డ్రైవ్ చేసినట్లుగా పోలీస్ స్టేషన్‌కు వచ్చాడు. పోలీసుల్ని తప్పుదోవ పట్టించే యత్నం చేశాడు. కానీ, సీసీ ఫుటేజీ, ఘటన దర్యాప్తు ద్వారా రహిల్‌ వాహనం నడిపినట్లు నిర్ధారించుకున్నాం. రహిల్‌పై గతంలో జూబ్లీహిల్స్‌లో ఓ యాక్సిడెంట్‌ కేసు నమోదు అయ్యింది (ఆ కేసులో ఓ బాలుడు కూడా మృతి చెందాడు).  ఆ కేసు పూర్వాపరాలను కూడా గమనిస్తాం. అదుపులోకి తీసుకున్న వ్యక్తుల్ని కోర్టులో ప్రవేశపెడతాం అని డీసీపీ సాక్షితో అన్నారు.

>
మరిన్ని వార్తలు