నాలుగోసారి ఆడపిల్ల పుట్టిందని..

7 Nov, 2022 08:17 IST|Sakshi

శ్రీనివాసపురం: ఆడపిల్లయినా, మగపిల్లాడైనా ఒక్కరు ముద్దు, ఇద్దరు హద్దు అన్నారు. అధిక సంతానం వల్ల దేశానికే కాదు కుటుంబ పోషణకూ భారమే. ఇది గుర్తెరగకుండా పట్టుదలకు పోతే విషాదమే. వరుసగా నాలుగోసారి ఆడపిల్ల పుట్టిందని తండ్రి ఆత్మహత్య చేసుకున్న ఘటన ఆదివారం కోలారు జిల్లా శ్రీనివాసపుర తాలూకాలోని శెట్టిహళ్లి గ్రామంలో చోటు చేసుకుంది.

వివరాలు.. శెట్టిహళ్లి గ్రామానికి చెందిన లోకేష్‌ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. 8 సంవత్సరాల క్రితం చిత్తూరు జిల్లా పుంగనూరుకు చెందిన శిరీష అనే యువతిని పెళ్లి చేసుకున్నాడు. వీరికి ముగ్గరు ఆడపిల్లలు జన్మించారు. మగబిడ్డ పుట్టలేదని లోకేష్‌ స్నేహితులతో చెప్పుకుని బాధపడేవాడు. శిరీష గర్భం దాల్చి ఈ నెల 4వ తేదీన ఆడబిడ్డకు జన్మనిచ్చింది.

దీంతో లోకేష్‌ తీవ్ర ఆవేదనకు గురయ్యాడు. ఇంట్లో నుంచి తల్లి, తమ్మున్ని మరో ఇంటికి పంపించి ఒక్కడే పడుకున్నాడు. అర్ధరాత్రి సమయంలో ఫ్యాన్‌కు చీరతో ఉరివేసుకున్నాడు. ఆదివారం ఉదయం విషయం తెలిసి లోకేష్‌ తల్లిదండ్రులు, భార్య తీవ్రంగా విలపించారు. పోలీసులు చేరుకుని వివరాలు సేకరించారు. 

(చదవండి: నా భార్యతో వివాహేతర సంబంధం పెట్టుకున్నావా?.. వీడియో బయటపెడతా)

మరిన్ని వార్తలు