ఫైబర్‌నెట్‌ కేసులో కీలక పరిణామం.. ఆస్తుల అటాచ్‌మెంట్‌కు పిటిషన్‌

6 Nov, 2023 14:17 IST|Sakshi

సాక్షి, విజయవాడ: ఆంధ్రప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిపై నమోదైన ఫైబర్‌నెట్‌ కుంభకోణం కేసులో సోమవారం కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో నిందితుడైన చంద్రబాబు నాయుడి సన్నిహితుల ఆస్తులను అటాచ్‌ చేసేందుకు అనుమతించాల్సిందిగా కోరుతూ రాష్ట్ర సీఐడీ విజయవాడలోని అవినీతి నిరోధక శాఖ ప్రత్యేక న్యాయస్థానంలో పిటిషన్‌ దాఖలు చేసింది. సీఐడీ ఇప్పటికే ఈ అంశంపై చేసిన ప్రతిపాదనకు రాష్ట్ర హోం శాఖ అనుమతి ఇచ్చిన విషయం తెలిసిందే.

తాజాగా సీఐడీ సోమవారం ఏసీబీ కోర్టులో వేసిన పిటిషన్‌లోనూ ఫైబర్ నెట్ కుంభకోణం నిందితులకు సంబంధించిన ఏడు స్థిరాస్తులను అటాచ్‌ చేసేందుకు అనుమతించాలని కోరింది. ఈ జాబితాలో టెరాసాఫ్ట్‌ కంపెనీతోపాటు చంద్రబాబు సన్నిహితులకు చెందిన స్థిరాస్తులు ఉన్నాయి. వీటిని అటాచ్‌ చేయాల్సిన అవసరం ఉందని పిటిషన్‌లో విజ్ఞప్తి చేసింది.  

చంద్రబాబు  ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఫైబర్ నెట్ కుంభకోణంలో రూ. 114 కోట్లు దుర్వినియోగమయ్యామని సీఐడీ ఇప్పటికే ఎఫ్ ఐ ఆర్ నమోదు చేసింది. ఈ కేసులో ఏ1 గా వేమూరి హరికృష్ణ,  ఏ-11 గా టెర్రా సాఫ్ట్ ఎండీ తుమ్మల గోపీచంద్‌ పేర్లు ఉండగా.. చంద్రబాబు పేరును ఏ-25 గా సీఐడీ చేర్చింది.

సీఐడీ ప్రతిపాదనల్లో ఉంది ఏంటంటే..
►తుమ్మల గోపీచంద్, ఆయన భార్య పావని పేర్లపై హైదరాబాద్ శ్రీనగర్ కాలనీ, యూసఫ్ గూడ, జూబ్లీహిల్స్ కాలనీ, చిన్నమంగళారం లలో ఉన్న ఇళ్లు, వ్యవసాయ క్షేత్రాలు

►నెటాప్స్ ఫైబర్ సొల్యూషన్స్ డైరక్టర్ కనుమూరి కోటేశ్వరరావుకి చెందిన గుంటూరు, విశాఖ కిర్లంపూడి లే అవుట్ లోని ఇళ్లు.

►మొత్తంగా అటాచ్‌ చేసే ఆస్తుల్లో గుంటూరులో ఇంటి స్థలం, విశాఖపట్నంలో ఓ ఫ్లాట్, హైదరాబాద్‌లోని నాలుగు ఫ్లాట్లు, తెలంగాణలోని రంగారెడ్డి జిల్లాలో వ్యవసాయ భూమి. 

హోంశాఖ ఉత్తర్వుల నేపథ్యంలో  సీఐడీ ఆ స్థిరాస్తుల అటాచ్‌మెంట్‌కు అనుమతించాలని కోరుతూ విజయవాడ ఏసీబీ న్యాయస్థానంలో పిటిషన్‌ను దాఖలు చేసింది. 

మరిన్ని వార్తలు