సరదాగా పిక్‌నిక్‌కు వెళ్లి తిరిగిరాని లోకాలకు.. నదిలో మునిగి ఐదుగురు చిన్నారులు మృతి

18 Oct, 2022 19:51 IST|Sakshi

భోపాల్: మధ్యప్రదేశ్ కట్నీ జిల్లాలో విషాద ఘటన జరిగింది. సరదాగా పిక్‌నిక్‌కు వెళ్లిన ఐదుగురు బాలురు కట్నీ నదిలో మునిగి ప్రాణాలు కోల్పోయారు. అందరీ వయసు 13-15 ఏళ్లే. సోమవారం సాయంత్రం ఈ ఘటన జరిగినట్లు అధికారులు తెలిపారు.

గర్రా ఘాట్‌కు వెళ్లిన ఈ ఐదుగురు చిన్నారులు నదిలో స్నానం చేసేందుకు దిగే.. ప్రమాదవశాత్తు మునిగిపోయి ఉంటారని అధికారులు అనుమానిస్తున్నారు. ఇంటి నుంచి వెళ్లిన చిన్నారులు తిరిగిరాకపోవడంతో తల్లిదండ్రులు వాళ్ల కోసం వెతికారు. ఈ క్రమంలోనే పిల్లల దుస్తులు ఘాట్‌లో కన్పించాయి. వెంటనే అప్రమత్తమైన అధికారులు రెస్కూ ఆపరేషన్ నిర్వహించారు.

కానీ ఐదుగురు పిల్లల్లో ఒక్కరు కూడా ప్రాణాలతో మిగల్లేదు. అందరి మృతదేహాలను సహాయక సిబ్బంది మంగళవారం ఉదయం నది నుంచి బయటకు తీశారు. పసిప్రాయంలోనే ప్రపంచాన్ని వీడిన తమబిడ్డలను చూసి తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించారు. వీరిని చూసి స్థానికులు చలించిపోయారు. మరైవైపు.. మరణించిన చిన్నారుల కుటుంబాలకు రూ.4లక్షల చొప్పున పరిహారం అందిస్తామని ప్రభుత్వ అధికారులు తెలిపారు.
చదవండి: రైలులో గొడవ.. యువకుడ్ని కిందకు తోసేసిన తోటి ప్రయాణికుడు

మరిన్ని వార్తలు