Satvik Suicide Case: ఇంటర్‌ విద్యార్థి సాత్విక్ సూసైడ్‌ కేసులో నలుగురు అరెస్ట్‌

3 Mar, 2023 18:00 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఇంటర్ విద్యార్థి స్వాత్విక్ సూసైడ్ కేసులో నలుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు.  లెక్చరర్‌ ఆచార్య, వార్డెన్‌ నరేష్‌ సహా మరో  ఇద్దరిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. వారిని రాజేంద్రనగర్‌ మేజిస్ట్రేట్‌ ముందు నార్సింగి పోలీసులు హాజరుపరిచారు

కాగా, నార్సింగిలోని శ్రీ చైతన్య కాలేజీలో ఇంటర్‌ ఫస్ట్‌ ఇయర్‌ చదువుతున్న విద్యార్థి సాత్విక్‌ ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన విషయం తెలిసిందే..  గత మంగళవారం రాత్రి క్లాస్‌ రూమ్‌లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకోగా గమనించిన తోటి విద్యార్థులు వెంటనే ఆసుపత్రికి తరలించే ప్రయత్నం చేశారు. అయితే ఆసుపత్రికి తరలించేలోపే సాత్విక్‌ మృతి చెందినట్టు వైద్యులు నిర్ధారించారు. మరోవైపు తోటి విద్యార్థులు సైతం కాలేజీ ఒత్తిడి వల్లే సాత్విక్‌ ఆత్మహత్యకు పాల్పడినట్టుగా ఆరోపిస్తున్నారు.

ఇది ఇలా ఉండగా, నార్సింగి శ్రీచైతన్య కాలేజీ హాస్టల్‌ నుంచి సాత్విక్‌ సామగ్రిని తీసుకుంటున్న సమయంలో అతడి డ్రెస్‌ల మధ్య సూసైడ్‌ నోట్‌ బయటపడింది. అందులో ప్రిన్సిపాల్‌ కృష్ణారెడ్డి, అడ్మిన్‌ ప్రిన్సిపాల్‌ ఆచార్య, శోభన్, క్యాంపస్‌ ఇన్‌చార్జి నరేశ్‌ల వేధింపులు భరించలేకనే ఆత్మహత్యకు పాల్పడుతున్నట్టు సాత్విక్‌ పేర్కొన్నాడు. తనతోపాటు తన మిత్రులకూ వారు నరకం చూపిస్తున్నారని, వారిపై సీరియస్‌ యాక్షన్‌ తీసుకోవాలని కోరాడు.
చదవండి: సాత్విక్‌ సూసైడ్‌ నోట్‌.. నివ్వెరపోయే విషయాలు

‘‘అమ్మ, నాన్న, అన్న.. ఈ పనిచేస్తున్నందుకు నన్ను క్షమించండి. మిమ్మల్ని బాధపెట్టాలని కాదు. కాలేజీలో పెట్టే మెంటల్‌ టార్చర్, వాళ్లు చూపే నరకాన్ని భరించలేకనే ఈ చెడ్డ పని చేస్తున్నాను. మిస్‌ యూ. మీ అందరినీ బాధపెడుతున్నందుకు సారీ.. నన్ను క్షమించండి, నా కోసం మీరు బాధపడితే నా ఆత్మ శాంతించదు. మీరు హ్యాపీగా ఉంటే నేను హ్యాపీగా ఉంటాను. అమ్మా, నాన్నకు నేను లేనిలోటు రాకుండా చూసుకో అన్నా..’’అని సూసైడ్‌ నోట్‌లో పేర్కొన్నాడు. ఆ లేఖ బాగా నలిగిపోయి ఉండటం చూస్తే.. కొన్ని రోజుల కిందే రాసిపెట్టుకున్నట్టు ఉందని సాత్విక్‌ స్నేహితులు చెప్తున్నారు. 

మరిన్ని వార్తలు