అత్తారింటికి వెళ్లి.. భార్య, బామ్మర్దిపై కత్తితో దాడి 

22 Nov, 2021 08:59 IST|Sakshi
దాడిలో గాయపడిన భారతి  

పోలీస్‌ స్టేషన్‌లో లొంగిపోయిన భర్త  

ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న  భారతి, భాస్కర్‌

సాక్షి, ఉక్కునగరం(గాజువాక): కుటుంబ సమస్యల నేపథ్యంలో భార్య, బామ్మర్దిలపై కత్తితో దాడి చేసి గాయపర్చిన సంఘటన వడ్లపూడి రైల్వే క్వార్టర్స్‌ చోటుచేసుకుంది. స్టీల్‌ప్లాంట్‌ పోలీసులు అందించిన వివరాలివి.. గాజువాకలోని సుందరయ్య కాలనీకి చెందిన భాస్కర్‌ (33) వెల్డింగ్‌ పనులు చేస్తుంటాడు. అతనికి రైల్వే కార్టర్స్‌కు చెందిన భారతి (31)తో గతంలో వివాహం జరిగింది. భార్యతో మనస్పర్థల వల్ల రెండేళ్ల నుంచి గొడవలు పడుతున్నారు. ఇప్పటికే రెండుసార్లు గాజువాక పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు కూడా చేశారు. ఒక కేసు కోర్టులో నడుస్తోంది. గత కొన్ని రోజులుగా ఆమె తల్లిదండ్రుల వద్ద ఉంటుంది.

ఆదివారం రాత్రి భాస్కర్‌ రైల్వే క్వార్టర్స్‌లోని అత్తారింటికి వెళ్లి తలుపు కొట్టాడు. తలుపు తీసిన బామ్మర్ది గోపాలకృష్ణ పొట్టలో కత్తితో పొడిచాడు. ఈలోగా అక్కడికి వచ్చిన భార్య భారతి మెడపై, కడుపులో, ఎడమ చేతిపై దాడి చేశాడు. దీంతో ఆ ప్రాంతమంతా రక్తపు మరకలతో నిండిపోయింది. స్థానికులు వచ్చి అతడిని అడ్డుకున్నారు. గాయాలపాలైన వారిని చికిత్స నిమిత్తం మొదట గాజువాక ప్రైవేటు ఆసుపత్రికి, ఆ తర్వాత నగరంలోని ఆసుపత్రికి తరలించారు. అతను గాజువాక పోలీస్‌స్టేషన్‌లో లొంగిపోయాడు. కేసు స్టీల్‌ప్లాంట్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధి కావడంతో స్టీల్‌ప్లాంట్‌ పోలీసులకు సమాచారం అందించారు. స్టీల్‌ప్లాంట్‌ సీఐ సత్యనారాయణరెడ్డి సంఘటన స్థలాన్ని సందర్శించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 

చదవండి: (సరదాగా గడిపేందుకు వెళ్లిన సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి కుటుంబంలో విషాదం) 

మరిన్ని వార్తలు