నీవు లేని జీవితం నాకొద్దు.. నీ వద్దకే వస్తా

2 Nov, 2020 08:07 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

భార్య సమాధి వద్ద పురుగుల మందు తాగిన రైతు

అనాథలైన చిన్నారులు

సాక్షి, పెద్దపల్లి : భార్య మరణాన్ని తట్టుకోలేక ‘నీవు లేని జీవితం నాకొద్దు.. నేను నీ వద్దకే వస్తా’ అంటూ కొన్ని రోజులుగా కలవరించిన భర్త చివరకు ఆమె సమాధి వద్ద పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన పెద్దపల్లి జిల్లా కాల్వశ్రీరాంపూర్‌ మండలం ఆరెపల్లె గ్రామంలో ఆదివారం జరిగింది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన లోమిట రాజు భార్య రమ్య క్యాన్సర్‌తో నాలుగేళ్ల క్రితం మృతిచెందింది. భార్య మృతిని తట్టుకోలేని రాజు తర్వాత మద్యానికి బానిసయ్యాడు. ‘రమ్య నేను నీవద్దకే వస్తానంటూ నిత్యం రోదిస్తుండే వాడు’. రాజు–రమ్య దంపతులకు సిరి(12), వైష్ణవి(9) కూతుర్లు ఉన్నారు.

ఈ క్రమంలో ఆదివారం మధ్యాహ్నం పత్తి చేను వద్దకు వెళ్తున్నానని కూతుళ్లకు చెప్పాడు. వారు కూడా తండ్రి వెనకాలే వెళ్లారు. రాజు భార్య సమాధి వద్దకు చేరుకుని రోదిస్తూ పురుగుల మందు తాగాడు. గమనించిన కూతుళ్లు పరుగున వచ్చి కుటుంబసభ్యులకు తెలిపారు. బంధువులు వెళ్లేసరికే రాజు స్ప్రహకోల్పోయాడు. వెంటనే పెద్దపల్లి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. తల్లిదండ్రుల మృతితో చిన్నారులు అనాథలయ్యారు. తండ్రికోసం చిన్నారుల రోదనలు గ్రామస్తులను కంటతడి పెట్టించాయి. కాల్వశ్రీరాంపూర్‌ ఎస్సై వెంకటేశ్వర్లు కేసు దర్యాప్తు చేస్తున్నారు.   

మరిన్ని వార్తలు