భార్యపై కోపంతో మ్యాట్రిమెునిలో వివరాలు

21 Oct, 2021 07:11 IST|Sakshi
అరెస్టయిన భర్త ఓంకుమార్‌

సాక్షి, తిరువళ్లూరు(తమిళనాడు): ఇద్దరి మధ్య మనస్పర్థలు రావడంతో విడిపోవాలని నిర్ణయించుకున్నారు. విడాకులు తీసుకోవాలని కోర్టును కూడా ఆశ్రయించారు. విచారణ సాగుతున్న క్రమంలో భార్యకు సంబంధించిన వివరాలను మ్యాట్రిమొనిలో పెట్టి వక్రబుద్ధి చాటుకున్నాడు. మామ ఫిర్యాదుతో చివరికి అరెస్టయ్యాడు. వివరాలు.. తిరువళ్లూరు జిల్లా కడంబత్తూరు యూనియన్‌కి చెందిన యువతి(32)కి వెళ్లియూర్‌ పంచాయతీ అధ్యక్షుడు సురేష్‌బాబు కుమారుడు ఓంకుమార్‌(34)తో 2016లో వివాహం జరిగింది. వీరికి ఐదేళ్ల కుమారుడు ఉన్నాడు. మనస్పర్థలు రావడంతో కొంతకాలంగా దూరంగా ఉంటున్నారు.

విడాకులు కావాలని పూందమల్లి కోర్టులో ఓంకుమార్‌ పిటిషన్‌ దాఖలు చేయడంతో విచారణ సాగుతోంది. రెండు వారాల క్రితం ప్రముఖ మ్యాట్రిమొనిలో వరుడు కావాలని భార్య వివరాలను ఉంచాడు. ఆసక్తి ఉన్న వారు యువతి తండ్రిని సంప్రదించాలని పేర్కొన్నాడు. యువతి తండ్రికి ఫోన్‌కాల్స్‌ రావడంతో ఆయన తిరువళ్లూరు సైబర్‌ క్రైమ్‌ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. విచారణలో ఓంకుమార్‌ విషయం తెలిసింది. పోలీసులు బుధవారం ఓంకుమార్‌ను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.  

చదవండి: 'లవ్‌స్టోరి'ని తలపిస్తున్న తమిళనాడు జంట కథ

మరిన్ని వార్తలు