Hyderabad: బోర్డ్ తిప్పేసిన ఐటీ సంస్థ.. రోడ్డున పడ్డ 800 మంది ఉద్యోగులు

30 May, 2022 16:12 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: నిరుద్యోగుల ఆశలను అవకాశంగా మార్చుకుని వారి వద్ద అందినంత దోచుకుని బోర్డు తిప్పేసింది ఓ సాఫ్ట్‌వేర్‌ కంపెనీ. ఈ దెబ్బతో 800 మంది సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు రోడ్డున పడ్డారు. ఈ ఘటన హైదరాబాద్‌లోని మాదాపూర్‌లో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..  మాదాపూర్‌లోని ఇన్నోహబ్‌ టెక్నాలజీస్‌ సంస్థ సాఫ్ట్‌వేర్‌ జాబ్ పేరిట ఒక్కో నిరుద్యోగి నుంచి 2 లక్షల వరకు వసూలు చేసింది.

ఈ క్రమంలో సుమారు 20 కోట్లు వరకు నిరుద్యోగుల నుంచి వసూలు చేసి వారికి రెండు నెలల పాటు ట్రైనింగ్ కూడా ఇచ్చి జీతాలు ఇచ్చారు. అయితే అకస్మాత్తుగా రెండు వారాల క్రితం కంపెనీ వెబ్సైట్,మెయిల్స్ బ్లాక్ చేసింది ఇన్నోహబ్‌ టెక్నాలజీస్‌ సంస్థ. దీంతో షాకైన ఉద్యోగులు సమాచారం ఆరా తీసేందేకు ప్రయత్నించగా సంస్థకు సంబంధించి ఉద్యోగులు,బోర్డ్ లేకపోవడంతో తాము మోసపోయినట్లు తెలుసుకున్నారు. దీనిపై మాదాపూర్ పోలీస్ స్టేషన్లో బాధిత ఉద్యోగులు ఫిర్యాదు చేశారు. పోలీసులకు ఫిర్యాదు చేసి వారం గడుస్తున్నా పోలీసులు పట్టించుకోవడం లేదంటూ సోమవారం మాదాపూర్ పోలీస్ స్టేషన్ ముందు బాధిత ఉద్యోగులు ఆందోళన చేపట్టారు.

బ్యాక్ డోర్ ఉద్యోగాలను నమ్మొద్దు
ఇక ఈ ఘటనపై మాదాపూర్‌ సీఐ రవీంద్ర ప్రసాద్‌ మీడియాతో మాట్లాడారు. ‘మే 28 న హన్మకొండ కు చెందిన యువకుడు తమకు ఫిర్యాదు చేశారు. కొత్తగూడలోని ఇన్నో హాబ్ టెక్నాలజీస్ పేరుతో సాఫ్ట్‌వేర్ కంపెనీ నిరుద్యోగుల నుంచి లక్షన్నర రూపాయల చొప్పున వసూలు చేసినట్టు తెలిసింది. ఆ తరువాత బోర్డు తిప్పేసి నిందితులు పారిపోయారు. ఉద్యోగం ఇచ్చిన తరువాత వర్క్ ఫ్రమ్ హోమ్ అని  చెప్పి బుకాయించారు. ఇప్పటి వరకు 60 మంది బాధితులు ఫిర్యాదు చేశారు. బ్యాక్ డోర్ ఉద్యోగాలను నమ్మొద్దు. అలా డబ్బులు ఇచ్చి ఉద్యోగం తీసుకున్నారంటే మీరే ఎంకరేజ్ చేస్తున్నట్లు. ప్రస్తుతం కంపెనీకీ సంబంధించి  కమలేష్ కుమారి, రాహుల్ అలోక్, వైష్ణవి, ముద్ర, ప్రదీప్‌గా గుర్తించాం. వీళ్లంతా హెచ్ ఆర్, మేనేజ్‌మెంట్‌కు సంబంధించిన వాళ్లు.

చదవండి: AP Crime: ఇలా చేశావేంటి అలెగ్జాండర్‌.. యువతిని నమ్మించి.. మోసగించి.. మరో మహిళతో..

మరిన్ని వార్తలు